AP Politics : గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టార్గెట్గా రాజకీయాలు వేడెక్కాయి. దుట్టా రామచంద్రరావుతో యార్లగడ్డ వెంకట్రావ్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. వంశీకి చెక్ పెట్టేందుకే.. ఇద్దరు శత్రువులు ములాకత్ అయ్యారని అంటున్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గన్నవరం నుంచి పోటీచేసిన వల్లభనేని వంశీ.. వైసీపీ అభ్యర్థి యార్లగడ్డపై విజయం సాధించారు. గెలిచిన కొన్నాళ్లకే టీడీపీకి గుడ్ బై చెప్పేసి జగన్కు మద్దతిచ్చారు వంశీ. వైసీపీ కండువా కప్పుకోలేదు కానీ.. అనధికారిక సభ్యుడిగా కొనసాగుతున్నారు. అప్పటినుంచీ అసంతృప్తితో రగిలిపోతున్నారు యార్లగడ్డ వెంకట్రావ్. అటు, టికెట్ ఆశిస్తున్న దుట్టా రామచంద్రరావుకు సైతం వంశీతో పడటం లేదు. ఆ ముగ్గురు నేతల అనుచరుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. విషయం జగన్ వరకూ వెళ్లినా ఎవరూ తగ్గట్లే.
లేటెస్ట్గా యార్లగడ్డ, దుట్టా భేటీ కావడం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. యార్లగడ్డ, దుట్టా ఇద్దరూ టీడీపీకి టచ్లో ఉన్నారనే వార్తలూ వస్తున్నాయి. వంశీకి బ్రేక్ వేయడానికి దుట్టా, యార్లగడ్డను టీడీపీ ప్రయోగిస్తోందని కూడా అంటున్నారు. వారి ట్రయాంగిల్ పోరుతో.. గన్నవరం రాజకీయం గరంగరంగా మారుతోంది.