BJP news Telangana: సరైన సమయంలో సరైన పాయింట్ పట్టుకుంది బీజేపీ. రేసులో వెనకపడిందని అనుకుంటున్న సమయంలో.. సడెన్గా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఇష్యూతో రాజకీయంగా ఫుల్ యాక్టివ్ అయింది. కాంగ్రెస్కు ధీటుగా మళ్లీ లైమ్లైట్లోకి వచ్చేసింది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి వానలో తడుస్తూ రోడ్డుపై బైఠాయించిన తీరు రక్తి కట్టింది. అదే టెంపోను కంటిన్యూ చేస్తూ.. మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నాకు పిలుపునిచ్చింది.
అయితే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తామంటే పోలీసులు ఊరుకుంటారా? పర్మిషన్ లేదంటూ చెక్ పెట్టారు. అదేంటి శాంతియుత ధర్నాకూ అనుమతి ఇవ్వరా? అంటూ కమలనాథులు హైకోర్టుకు వెళ్లారు. పిటిషన్ పరిశీలించిన కోర్టు.. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఏవో కారణాలు చూపించి ధర్నాకు అనుమతి నిరాకరించడమేంటని నిలదీసింది. వెయ్యి మందికే భద్రత ఇవ్వలేకపోతే.. కోటి మందికి ఎలా రక్షణ కల్పిస్తారని గట్టిగానే ప్రశ్నించింది.
మంగళవారం నాటి మహాధర్నాకు అనుమతిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ధర్నాలో 500 మంది మాత్రమే పాల్గొనాలని పరిమితి విధించింది. ఎలాంటి ర్యాలీలు తీయొద్దని సూచించింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కమలదళంలో జోష్ పెరిగింది. మహాధర్నాతో బీజేపీ వాయిస్ బిగ్గరగా వినిపించేలా సన్నాహాలు చేస్తోంది.
ఓవైపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. జీహెచ్ఎమ్సీ పరిధిలో 70వేల ఇండ్లు లబ్దిదారులకు అందజేయనుంది. అయితే, ఆ మైలేజ్ బీఆర్ఎస్కు రాకుండా బీజేపీ వెంటనే రంగంలోకి దిగింది. కేంద్రం ఇచ్చిన సొమ్ముతోనే ఆ ఇండ్లు కట్టారని చెబుతోంది. కేంద్రం ఇచ్చేది సగం డబ్బులే అని సర్కారు అంటోంది. ఏపీలో లక్షల్లో డబుల్ ఇండ్లు కడితే.. తెలంగాణలో వేలల్లో మాత్రమే నిర్మించారని తప్పుబడుతోంది. అరకొరగా కట్టి వదిలేసిన బాలసింగారం బాట పట్టి.. కిషన్రెడ్డి ఇష్యూని బీజేపీ వైపు డైవర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మహాధర్నాతో మరింత జోరు పెంచారు.
అయితే, కమలనాథులు ఇంతగా రాజకీయం చేస్తున్నా.. ఎందుకో గానీ కాంగ్రెస్ ఈ విషయంలో వెనకబడింది. వాళ్లు టేకప్ చేసిన ఇష్యూలో తామెందుకు ఇన్వాల్వ్ కావాలనుకున్నారో ఏమో.. ప్రస్తుతానికైతే వేరే అంశాలపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. గతంలో మాదిరి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని.. సొంత స్థలంలో కట్టుకునే వారికి డబ్బులు ఇస్తామని.. ఇప్పటికే హామీ ఇచ్చింది.