Raza New Records : T20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై సూపర్ విక్టరీ తర్వాత… జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజా పేరు మార్మోగిపోతోంది. పాకిస్థాన్ లో పుట్టి, తల్లిదండ్రులతో కలిసి జింబాబ్వేకు వలస వెళ్లిన రజా… ఆ దేశం తరఫున ఆడుతూ… మాతృదేశ క్రికెట్ జట్టుకే షాకిచ్చాడు. కీలకమైన 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న రజా…. ఈ ఒక్క మ్యాచ్ తో ఎన్నో రికార్డులు తిరగరాశాడు.
పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ తో… కింగ్ కోహ్లీ పేరు మీద ఉన్న రెండు రికార్డులను బద్దలుకొట్టాడు… రజా. అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. 2022లో రజాకు ఇప్పటిదాకా 7 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు లభించాయి. అంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2016లో టీ20ల్లో కోహ్లీ ఆరుసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఇప్పుడు పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుని… కోహ్లీ కంటే ఎక్కువగా ఒక క్యాలెండర్ ఇయర్ లో 7 టీ20 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లు అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు… రజా.
అంతేకాదు… కింగ్ కోహ్లీ పేరు మీద ఉన్న మరో రికార్డును కూడా రజా చెరిపేశాడు. ఇప్పటిదాకా టీ20 ప్రపంచకప్లో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న రికార్డు కోహ్లీ పేరు మీద ఉండేది. 2016 T20 వరల్డ్ కప్ లో రెండుసార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సాధించాడు.. కోహ్లీ. తాజాగా జరుగుతున్న ప్రపంచకప్ లో మూడుసార్లు రజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికై… కోహ్లీ పేరుతో ఉన్న రికార్డును తన పేరిట రాసుకున్నాడు. T20 వరల్డ్ కప్ గ్రూప్ 2లో జింబాబ్వేకు ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉండటంతో… రజా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.