Facebook Love: ఈ మధ్య సోషల్ మీడియా ప్రేమలతో దేశ సరిహద్దులు దాటుతున్న ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. మొన్న పాక్ మహిళ సీమా హైదర్ ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తితో పబ్జీ ప్రేమలో పడి తన నలుగురు పిల్లలతో ఇండియాకు వచ్చింది. ఐతే ఆమె పాక్ గూడాఛారి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈసారి ఇటు నుంచి అటు లవ్ ట్రాక్ నడిచింది. ఫేస్బుక్ ప్రేమతో ప్రియుడి కోసం పాక్కు వెళ్లింది ఓ భారత మహిళ. ఆమెకు అల్రెడీ పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఫేస్బుక్ స్నేహితుణ్ని కలుసుకునేందుకు పాక్లో అడుగుపెట్టింది.
34 ఏళ్ల అంజు, అర్వింద్ దంపతులు రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని భివాడీలో నివసిస్తున్నారు.వారికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజుకు ఫేస్బుక్లో పాక్కు చెందిన నస్రుల్లా అనే 29 ఏళ్ల యువకుడితో కొన్ని నెలల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఔషధ రంగంలో పనిచేస్తున్న నస్రుల్లాను కలుసుకోవడానికి అంజు వాయవ్య పాక్లోని అప్పర్ దిర్ జిల్లాకు వెళ్లింది. అక్కడి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే వీసాతోపాటు ఇతర అనుమతి పత్రాలన్నీ సక్రమంగా ఉండటంతో ఆమెను విడిచిపెట్టారు.