Gyanvapi mosque : వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేపట్టింది. పోలీసుల బృందం ముందుగా లోనికి ప్రవేశించింది. ఆ తర్వాత ఏఎస్ఐ అధికారులు అక్కడికి చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీల్ వేసిన ప్రాంతాన్ని మాత్రం సర్వే నుంచి మినహాయించారు. కొన్నాళ్ల క్రితం వాజుఖానాలో ఓ ఆకారం బయటపడటంతో అది శివలింగమని హిందూ సంఘాలు వాదించాయి. నీటి కొలను నిర్మాణమని మసీదు కమిటీ వాదించింది. ఈ నేపథ్యంలో సర్వే చేపట్టాలని పురావస్తు శాఖను స్థానిక కోర్టు ఆదేశించింది.
సర్వే నివేదికను ఆగస్టు 4న జిల్లా న్యాయస్థానానికి అందించనున్నారు. శాస్త్రీయ సర్వే చేపట్టాలని వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ పిటిషన్పై సత్వరమే విచారణ చేపట్టాలని కోరింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే వ్యవహారంలో కీలక ఉత్తర్వులు ఇచ్చింది. వారణాసి కోర్టు ఇచ్చిన ఈ సర్వే ఆదేశాలపై స్టే విధించింది. జులై 26 సాయంత్రం 5 గంటల వరకు మసీదు ప్రాంగణంలో ఎలాంటి సర్వే చేపట్టరాదని స్పష్టం చేసింది.
2022న మే 16న జ్ఞాన్వాపి మసీదు కాంప్లెక్స్లోని వాజుఖానాలో ఆ ఆకారం బయటపడింది. జ్ఞానవాపి మసీదు కాశీ విశ్వనాథ్ ఆలయ కాంప్లెక్స్లో భాగమేనని, గోడలపై హిందూ దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయని తమకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఐదుగురు మహిళలు కోరడంతో ఈ వివాదం మొదలైంది. ఈ వాదనను మసీదు కమిటీ వ్యతిరేకించింది. ఆ నిర్మాణాన్ని శివలింగం అని హిందూ వర్గాలు వాదిస్తుంటే.. ఈ వస్తువు వజూఖానా రిజర్వాయర్ వద్ద వాటర్ ఫౌంటెన్ మెకానిజంలో భాగమని ముస్లిం సంఘం చెబుతోంది. ఇప్పటికే ఈ ఆకారంపై వీడియో రికార్డింగ్ సర్వే నిర్వహించారు.
జ్ఞానవాపి మసీదు విషయంలో ప్రార్థనా స్థలాల చట్టం-1991ను వర్తింప చేయాలని మసీదు కమిటీ కోరుతోంది. జ్ఞానవాపి మసీదుకు ఈ చట్టం వర్తించదని గతనెలలో న్యాయస్థానం తీర్పు చెప్పింది. శివలింగం లాంటి నిర్మాణంపై శాస్త్రీయ పరిశోధన నిర్వహించాలని హిందూ సంఘాల అభ్యర్థనను వారణాసి కోర్టు గతేడాది తిరస్కరించింది. అయితే అలహాబాద్ హైకోర్టు కార్బన్ డేటింగ్కు అనుమతించింది. ఈ ఏడాది మే 19న జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కార్బన్ డేటింగ్ పద్దతి సహా సైంటిఫిక్ సర్వేను నిర్వహించేందుకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు మే 12న ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. సైంటిఫిక్ సర్వేను వాయిదా వేయాలని ఆదేశించింది.
మసీదును పురాతన హిందూ దేవాలయంపై నిర్మించారా? లేదా? కనుగొనాలని కోర్టును నలుగురు మహిళలు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ఆధారంగా జులై 21న జ్ఞానవాపి మసీదు ప్రాంగణాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో శాస్త్రీయ సర్వే చేయించడానికి అనుమతినిచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో తాత్కాలికంగా సర్వే ఆగిపోయింది.