Westindies Vs India : వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. చివరిరోజు 8 వికెట్లు తీస్తే టీమిండియా సిరీస్ ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేస్తుంది. విండీస్ విజయం సాధించాలంటే ఇంకా 289 పరుగులు చేయాలి. ఆఖరి రోజు క్రీజులో నిలబడి అంత స్కోర్ చేయడం ఆ జట్టు బ్యాటర్లకు అంత వీజీ కాదు. బౌలర్లు తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే చెలరేగితే టీమిండియా విజయం లాంఛనమే.
తొలి ఇన్నింగ్స్ లో 229/5 ఓవర్ నైట్ స్కోర్ తో 4 రోజు ఆటను విండీస్ ప్రారంభించింది. అయితే మరో 26 పరుగులు మాత్రమే చేసి 255 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. ముఖేశ్ కుమార్, జడేజాకు తలో రెండు వికెట్లు దక్కాయి. అశ్విన్ ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 438 పరుగులు చేసింది. దీంతో 183 పరుగుల ఆధిక్యం టీమిండియాకు లభించింది.
రెండో ఇన్నింగ్స్ లో భారత్ ధాటిగా ఆడింది. టీ20 మ్యాచ్ మాదిరిగా టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. రోహిత్ (57), ఇషాన్ కిషన్ ( 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిశారు. జైస్వాల్ (38), గిల్ ( 29 నాటౌట్ ) రాణించడంతో రోహిత్ సేన.. కేవలం 24 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఈ స్కోర్ వద్దే రోహిత్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. దీంతో మొత్తం 364 పరుగుల లీడ్ భారత్ సాధించింది. 365 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన విండీస్.. 4వ రోజు ఆటముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. ఈ రెండు వికెట్లు అశ్విన్ కే దక్కాయి.