Telangana congress news today(TS politics): తెలంగాణలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఆదివారం హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిని పార్టీ ప్రచార వ్యూహకర్త సునీల్ కనుగోలు వివరించారు. 84 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ బలంగా ఉందని తెలిపారు. మరో 35 చోట్ల బలహీనంగా ఉందని చెప్పినట్లు సమాచారం. ఆ అసెంబ్లీ సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులను గుర్తించాలని సూచించారని తెలుస్తోంది.
ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు పీఏసీ సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, కమిటీ సభ్యులు జానారెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్రెడ్డి, మధుయాస్కీ, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దామోదర రాజనర్సింహా, జగ్గారెడ్డి, వీహెచ్, రేణుకా చౌదరి, జీవన్రెడ్డి ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై సునీల్ కనుగోలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సర్వేల్లో వెల్లడైన సమాచారం ఆధారంగా పార్టీ పరిస్థితిని వివరించారని తెలుస్తోంది.
ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో కనీసం 2 స్థానాలు బీసీలకు కేటాయించాలని రేవంత్రెడ్డి ప్రతిపాదించారని తెలుస్తోంది. వచ్చే 100 రోజులు ప్రచారం ముమ్మరంగా చేపట్టాలని కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది. హామీలపై కాంగ్రెస్ అగ్రనేతలు డిక్లరేషన్లు విడుదల చేయనున్నారు. బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇలా త్రిముఖ వ్యూహంతో ప్రచారంలో దూసుకెళ్లాలని టీపీసీసీ భావిస్తోంది. కాంగ్రెస్లో ఇతర పార్టీల నేతల చేరికల వల్ల ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఉన్న నేతలకు ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు, అగ్రనేతలతో భారీ బహిరంగసభల నిర్వహణ, ఎన్నికల్లో ఇవ్వాల్సిన హామీల రూపకల్పన ఇలాంటి అంశాలపై చర్చించింది.
రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయాలను మధుయాస్కీ, షబ్బీర్ అలీ వెల్లడించారు. ఈ నెల 30న కొల్లాపూర్లో నిర్వహించే బహిరంగసభకు ప్రియాంక గాంధీ హాజరవుతారని మధుయాస్కీ తెలిపారు. ఈ సభలో కొందరు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్లో చేరతారని తెలిపారు. ఆగస్టు 15న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గర్జన సభ జరుగుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఈ వర్గాల సంక్షేమం కోసం హామీలను రూపొందించడానికి 2 రోజుల్లో ఉపకమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. చేయూత పథకం కింద వృద్ధులకు రూ.4 వేల పింఛను ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.4016 పింఛను ఇస్తామని ప్రకటించడం.. కాంగ్రెస్ ఇచ్చిన హామీతో లభించిన విజయంగా పేర్కొన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీ, మహిళా డిక్లరేషన్లను పార్టీ విడుదల చేస్తుందని షబ్బీర్ అలీ తెలిపారు. ఈ డిక్లరేషన్లు రూపొందించడానికి ఉపకమిటీ వేస్తున్నామన్నారు.