Manipur : మణిపూర్లో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో దారుణ ఘటన బయటకు వచ్చింది. స్వతంత్ర సమరయోధుడి భార్యను అల్లరి మూకలు సజీవ దహనం చేశాయి. ఈ దారుణ ఘటన మే 28న కాక్చింగ్ జిల్లా సెరో గ్రామంలో జరిగిందని కథనాలు వచ్చాయి. ఆ రోజు స్వతంత్ర సమరయోధుడు చురాచాంద్ సింగ్ భార్య సోరోకైబామ్ ఇబెటోంబిని దుండగులు సజీవ దహనం చేశారు.
80 ఏళ్ల ఇబెటోంబి ఇంట్లో ఉండగానే దుండగులు గడియ పెట్టారు. ఆ తర్వాత ఆ ఇంటికి నిప్పుపెట్టారు. ఆమెను రక్షించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా అప్పటికే ఇల్లు మొత్తం దగ్ధమైంది. ఈ విషయాన్ని ఇబెటోంబి మనవడు ప్రేమ్కాంత్ తెలిపాడు. ఆ సమయంలో తాను త్రుటిలో తప్పించుకున్నానని వివరించాడు. తమపై కాల్పులు జరిగాయని చెయ్యి, కాలులోకి తూటాలు దూసుకుపోయాయని ఆ దారుణ ఘటనను గుర్తు చేసుకున్నాడు. ఇబెటోంబి భర్త చురచాంద్ సింగ్ దేశానికి చేసిన సేవలకుగాను మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ నుంచి సత్కారం అందుకొన్నారు.
ఇంఫాల్కు 45 కిలోమీటర్ల దూరంలో సెరో గ్రామం ఉంది. ఎంతో సుందరంగా ఉండే ఆ గ్రామంలో ప్రస్తుతం కాలిన గృహాలే దర్శనమిస్తున్నాయి. కుకీ-మైతేయ్ ఘర్షణల్లో అత్యంత దారుణంగా దెబ్బతింది ఈ గ్రామం. ఇబెటోంబి అస్థికలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయని కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. ఈ గ్రామం నుంచి ప్రజలు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. దీంతో సెరో గ్రామం నిర్మానుష్యంగా మారిపోయింది.