YCP : అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీని ఆధిపత్య పోరు కలవరపెడుతోంది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉప్పునిప్పుగా మారారు. ఇరువర్గాల మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఇటీవల పిల్లి బోస్ వర్గం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో పాల్గొన్న నేతలు మంత్రి వేణును టార్గెట్ చేశారు. ఆయనపై విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం టిక్కెట్ పిల్లి బోస్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇవ్వాలని తీర్మానించారు.
పిల్లి బోస్ వర్గం సమావేశం తర్వాత మంత్రి వేణు నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి ఎదుటే మున్సిపల్ వైస్ ఛైర్మన్ శివాజీపై దాడి జరిగింది. ఆయన పిల్లి బోస్ వర్గం నిర్వహించిన సమావేశానికి హాజరుకావడం ఈ దాడికి దారి తీసింది. మంత్రి వేణు అనుచురుడే ఈ దాడికి దిగడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
తాజాగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురం టిక్కెట్ మంత్రి వేణుకి ఇస్తే పోటీకి తాను సిద్ధమని బోస్ సవాల్ విసిరారు. అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని ప్రకటించారు. రామచంద్రపురం నియోజకవర్గంతో బోస్ కు చాలా అనుబంధం ఉంది. ఇక్కడ నుంచే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.
1989లో తొలిసారిగా కాంగ్రెస్ తరఫున బోస్ ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 1994,99 ఎన్నికల్లో ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్ టిక్కెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి గెలిచారు. 2009లో తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి , రోశయ్య కేబినెట్ ల్లో మంత్రిగా పనిచేశారు. 2014లో ఎన్నికల్లో మళ్లీ బోస్ ఓడిపోయారు. అయితే 2019లో మాత్రం మండపేట నుంచి బరిలోకి దిగి మళ్లీ ఓటమిని చవిచూశారు.
2019 ఎన్నికల్లో బోస్ ఓడినా అప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న ఆయన సీఎం జగన్ తొలి కేబినెట్ లో డిప్యూటీ సీఎం పదవిని పొందారు. ఆ తర్వాత బోస్ ను రాజ్యసభకు జగన్ పంపించారు. దీంతో ఆయన స్థానంలో రామచంద్రపురం నుంచి గెలిచిన వేణుకు మంత్రివర్గంలో చోటు దక్కింది. అప్పటి నుంచే ఈ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇప్పుడ టిక్కెట్ విషయంలో వార్ నడుస్తోంది. పిల్లి బోస్ పార్టీ వీడటం ఖాయమేనా..? వైసీపీ అధిష్టానం ఇద్దరి నేతల సయోధ్య కుదురుస్తుందా..? ఇప్పుడు ఈ అంశాలే రామచంద్రపురంలో ఆసక్తిగా మారాయి.
మరోవైపు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్తో ఎలాంటి విభేదాలు లేవని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్పష్టం చేశారు. ఆయనను తనకు రాజకీయ గురువుగా పేర్కొన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నడుచుకుంటానని తెలిపారు. వేణుగోపాలకృష్ణ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లయిన సందర్భంగా రామచంద్రపురంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేణు.. బోస్ వ్యాఖ్యలపై స్పందించనన్నారు.