Tomato : ఇన్నాళ్లూ డబ్బులు, బంగారం దోచుకెళ్లే వార్తలు విన్నాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. దేశంలో కొత్తగా టమాటా దొంగలు పడ్డారు. రేట్లు పెరిగినప్పుడల్లా టమాటాపై సోషల్ మీడియాలో జోకులు విపరీతంగా పేలుతుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది జోక్ కాదు.. నిజం. దేశంలో టమాటా దొంగలు పడ్డారు. కూరగాయల మార్కెట్ నుంచి టమాటా తోటల వరకు దొంగలు తమ టాలెంట్ చూపిస్తున్నారు. అంతేకాదు.. హైవేపై వెళ్తున్న టమాటా వాహనాలను కూడా టార్గెట్ చేస్తున్నారు. టమాటాలు ఎక్కడ కనిపిస్తే అక్కడే మాయం చేస్తూ.. తమ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ఘటనలతో టమాటా వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు.
తాజాగా కర్ణాటకలో టమాటా లోడ్ తో వెళ్తున్న ట్రక్కును హైజాగ్ చేశారు దుండగులు. చిత్రదుర్గ నుంచి పంటను అమ్ముకునేందుకు… కోలార్ తీసుకెళ్లేందుకు బయలుదేరాడు ఓ రైతు. ఇది గమనించి దంపతులు భాస్కర్, సింధూజ ట్రక్కును కారులో ఫాలో అయ్యారు. ఆ తర్వాత రైతుపై దాడి చేసి ట్రక్కు ఎత్తుకెళ్లిపోయారు. చెన్నైలో సరుకుని అమ్ముకుని తిరిగి కర్ణాటక సరిహద్దులో ట్రక్కు వదిలి పారిపోయారు. ఈ ఘటనపై రైతు శివన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను సీసీ పుటేజ్లో పోలీసులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఆ దంపతులను అరెస్ట్ చేశారు.
మరోవైపు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని కూరగాయల మార్కెట్లో టమాటాలు ఎత్తుకెళ్లాడో దొంగ. బైక్పై వచ్చిన వ్యక్తి ఆరు టమాటా బాక్సులను అపహరించాడు. ఈ దృశ్యాలు సీసీ పుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఒకే వ్యక్తి 3 సార్లు దొంగతానికి పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు.