Pawan Kalyan : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి భేటీ కానున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని ఇప్పటికే పవన్ కల్యాణ్ పలుసార్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు దూకుడు పెంచాయి. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇద్దరి నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తిని రేపుతోంది.
2019 ఎన్నికల తర్వాత 3సార్లు చంద్రబాబు, పవన్ భేటీ జరిగింది. విశాఖలో పవన్ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకోవడం, ఆయన బస చేసిన హోటల్ లో తనిఖీలు చేయడం, జనసేన నేతలను అరెస్టు చేయడం లాంటి పరిణామాలు జరిగినప్పుడు విజయవాడ నోవాటెల్ హోటల్ లో చంద్రబాబు.. పవన్ ను కలిసి సంఘీభావం ప్రకటించారు. అలాగే కుప్పం పర్యటనలో చంద్రబాబుపై వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించడం, టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి ఘటనల తర్వాత పవన్ హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఆయనను కలిసి సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత మరోసారి చంద్రబాబును పవన్ కలిశారు. అప్పట్లో పొత్తులపై తాము ఎలాంటి చర్చలు జరపలేదన్నారు పవన్.
తాజా భేటీలో పొత్తులపై చంద్రబాబు, పవన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో జనసేనాని పాల్గొన్నారు. తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పొత్తులపై బీజేపీ నేతల అభిప్రాయాలను చంద్రబాబుకు పవన్ వివరించే అవకాశం ఉందని సమాచారం. అలాగే జనసేన, టీడీపీ పొత్తుపైనా చర్చించవచ్చని తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ తమతో కలిసి రాకుంటే ఏం చేయాలనేదానిపైనా చర్చిస్తారని టాక్.
ఢిల్లీలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలతోపాటు, ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, దానిపై ప్రభుత్వ స్పందన లాంటి విషయాలపైనా చర్చించే అవకాశముంది.