Food: టేస్ట్ బాగుందని అంతా లొట్టలేసుకుంటూ తింటున్నారు. కబుర్లు చెప్పుకుంటూ ఉద్యోగులంతా కలిసి భోంచేస్తున్నారు. సడెన్గా పప్పులో.. చచ్చిన పాము కనిపించింది. అంతే. ఒక్కసారిగా అక్కడ ఉన్నవాళ్లంతా ఉలిక్కిపడ్డారు. ఇప్పటి వరకూ తాము తిన్న పప్పులో.. పాము పడిఉందని తెలుసుకొని హడలి పోయారు. కక్కలేక, మింగలేక.. తెగ హైరానా చెందారు. ఇదంతా హైదరాబాద్లోని ECIL క్యాంటీన్లో జరిగింది.
ఈసీఐఎల్ సెంట్రల్ క్యాంటీన్లో వండిన పదార్థాలను.. చర్లపల్లిలోని ఈవీఎం సంస్థకి మధ్యాహ్న భోజనంగా తీసుకొచ్చారు. ఉద్యోగులకు ఆహారం వడ్డిస్తుండగా.. పప్పులో నుంచి పాము పిల్ల బయటపడడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు.
గతంలో కూడా ఈ క్యాంటీన్ వ్యవహారం ఇలానే ఉండేదని అంటున్నారు. ఎలుకలు, బీడీలు, సిగరెట్టు ముక్కలు, జిల్లపురుగులు.. చాలాసార్లు ఫుడ్లో కనిపించాయని ఉద్యోగులు చెబుతున్నారు. నాణ్యత లేని ఆహారం పెడుతున్నారంటూ మండిపడుతున్నారు. క్యాంటిన్ నిర్వాహకులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.