Viveka case updates latest live(Breaking news in Andhra Pradesh): వైఎస్ వివేక హత్యకేసుకు సంబంధించిన కీలక అంశాలను ఆయన కుమార్తె సునీతా సీబీఐకి వెల్లడించారు. వివేకా హత్యకేసు ఛార్జిషీట్తో సునీత వాంగ్మూలాన్నిసీబీఐ కోర్టుకు సమర్పించింది. ఇంటికొచ్చి తనను కలుస్తానంటూ 2019, మార్చి 22న వైఎస్ భారతి ఫోన్ చేశారని సునీత వాంగ్మూలంలో తెలిపారు. తాను కడప, సైబరాబాద్ కమిషనరేట్ వెళ్లాల్సి ఉందని భారతికి చెప్పానని.. ఎక్కువ సమయం తీసుకోనంటూ.. భారతి వెంటనే ఇంటికి వచ్చేశారని సునీత అన్నారు. విజయమ్మ, వైఎస్ అనిల్రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రావడంతో తాను ఆశ్చర్యపోయానని.. లిఫ్టు వద్దే నిలబడి వైఎస్ భారతితో మాట్లాడినట్లు సునీత తెలిపారు. అప్పుడు వైఎస్ భారతి ఆందోళనగా కనిపించారని వాగ్మూలంలో తెలిపారు.
తన తండ్రి మరణించాక తొలిసారి ఇంటికొచ్చినందున బాధగా ఉన్నారని తాను భావించానని.. ఇకపై ఏం చేసినా సజ్జలతో టచ్లో ఉండాలని భారతి చెప్పటంతో ఆశ్చర్యానికి గురైనట్లు వెల్లడించారు. మీడియాతో మాట్లాడాలని సజ్జల తనకు చెప్పారన్న సునీత.. సజ్జల ఆలోచన కొంత ఇబ్బందిగా అనిపించి వీడియో చేసి పంపించినట్లు వాగ్మూలంలో చెప్పారు. గది శుభ్రం చేసేటప్పుడు ఉన్న సీఐ శంకరయ్యపై ఫిర్యాదుతో ఆ వీడియోను పంపించానని.. వీడియో కాదు.. అంశానికి ముగింపు పలికేలా ప్రెస్మీట్ పెట్టాలని సజ్జల తనకు చెప్పారంటూ సునీత చెప్పినట్లు సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది.
జగన్తో పాటు అవినాష్ పేరు కూడా ప్రస్తావించాలని సజ్జల సలహా ఇచ్చారన్న సునీత.. తాను అప్పటివరకు అవినాష్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదని వెల్లడించారు. అవినాష్ పేరు ప్రస్తావించాలని.. సజ్జల చెప్పినప్పుడు కొంత సంకోచించానని.. అవినాష్ అభ్యర్థిత్వానికి తన తండ్రి కోరుకోలేదని తెలుసని ఆమె చెప్పారు. రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా విబేధాలు ఉన్నాయని.. సజ్జల సలహా మేరకు హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ప్రెస్మీట్ పెట్టానట్లు సునీత తెలిపారు.
గదిని శుభ్రం చేయడంపై దర్యాప్తు చేయాలని మొదట్నుంచీ అడుగుతున్నానని.. పొరపాటు జరిగిందని తెలుసు కానీ.. క్రిమినల్ మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోలేదని సునీత సీబీఐతో అన్నారు. జగనన్నను సీఎంగా చూడాలని తన తండ్రి చాలా కష్టపడ్డారన్న సునీత.. ఎవరో చేసిన పొరపాటు వల్ల మళ్లీ జగన్ నష్టపోవాలా అని ఆలోచించినట్లు వాంగ్మూలంలో తెలిపారు.
తాను మార్చురీ బయట ఉన్నప్పుడు ఓ ఫిర్యాదు రాసుకొచ్చి సంతకం చేయమన్నారని.. ఆ ఫిర్యాదులో బీటెక్ రవి, ఇతర తెలుగుదేశం నేతలపై ఆరోపణలు ఉన్నాయని సునీత చెప్పుకొచ్చారు. వివేకా ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం నేతలు భయపడ్డారని అవినాష్ తనకు చెప్పారని సునీత వాంగ్మూలంలో తెలిపారు. టీడీపీ నేతలు మనసులో పెట్టుకుని ఈ నేరానికి పాల్పడ్డారని.. తనతో అవినాష్ అన్నారనే విషయాన్ని సునీత ప్రస్తావించారు. ఆ ఫిర్యాదుపై తాను సంతకం చేయలేదని సునీత వివరణ ఇచ్చారు.
జులైలో అవినాష్ రెడ్డిపై తనకు అనుమానం మొదలైందన్న సునీత.. హత్య విషయం తన కుమారుడికి ముందే తెలుసునని.. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి ఒకరితో చెప్పారని గుర్తు చేశారు. వివేకా మృతి విషయం బయటకు రాకముందే.. తన కుమారుడికి తెలుసునని ఆమె చెప్పారని విషయాన్ని ప్రస్తావించారు. అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి ఉదయ్ ప్రధాన అనుచరుడు కాబట్టి అనుమానం వచ్చిందన్న సునీత.. భారతి, సజ్జల వాట్సప్ చాట్ స్క్రీన్ షాట్లను సీబీఐకి అందచేశారు. ఈ విషయాలను సీబీఐ కోర్టుకు వివరించారు వైఎస్ సునీత.