Godavari Flood latest news(Telangana news live): గోదారి నిండా వర్షాలు. కరువు తీరేలా కుంభవృష్టి. పైనుంచి వరద పోటెత్తుతోంది. నిండుగోదారమ్మ గలగలా పారుతోంది. గోదావరిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా కళకళలాడుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి లక్షా 50వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. 12 గంటల్లోనే 8 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 49.968 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు దిగువకు వదలడంతో ఎల్లంపల్లికి భారీగా వరద వచ్చి చేరుతోంది. గోదావరి ఎగువ ప్రాంతం నుంచి లక్షా 23 వేల 741 క్యూసెక్కుల నీరు ఎల్లంపల్లికి వచ్చి చేరుతోంది. మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జలాశయంలోకి మరింత భారీగా నీరు వచ్చి చేరే అవకాశముంది. మొత్తం 20 గేట్ల ద్వారా లక్షా 54 వేల 630 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయంలో 20.175 టీఎంసీలకుగాను 17.869 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
రెండు రోజులుగా కురిసిన వర్షాలతో హిమాయత్ సాగర్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం పెరగడంతో 6 గేట్లు ఎత్తారు. హిమాయత్ సాగర్ ను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
మెదక్ జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తోన్న వర్షాలతో ఏడు పాయల అమ్మవారి ఆలయం ముందు మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. ఆలయం ఎదుట ఉధృతంగా ప్రవహిస్తోంది మంజీరా. అమ్మవారి దర్శనాన్ని నిలిపివేశారు అధికారులు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయ్.
భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి కాస్త తగ్గింది. ప్రస్తుతం నీటి మట్టం 38 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వరద తగ్గడంతో గోదారమ్మ శాంతిచ్చింది. భద్రాచలంలో గోదావరి ప్రవాహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ పరిశీలించారు. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 6 లక్షల 65 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. గోదావరిలో పడవ ప్రయాణాన్ని నిషేధించారు. ముంపు ప్రాంత మండల ప్రజలను అలర్ట్ చేశారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేస్తున్నారు.