Vijayashanthi latest tweet(Telangana BJP news today): తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్రెడ్డి ప్రమాణ స్వీకార వేదిక అనేక కాంట్రవర్సీలకు వేదికగా మారింది. బండి సంజయ్.. పార్టీలోని తన ప్రత్యర్థులపై పంచ్లేశారు. ఢిల్లీకి ఫిర్యాదులు, తప్పుడు రిపోర్టులు బంద్ చేయండన్నా.. అంటూ బాంబులు పేల్చారు. అదే వేదికపై మరో ఆసక్తికర ఘటన కూడా జరిగింది. అది మరింత హాట్ టాపిక్గా మారింది.
మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి.. ఆ డయాస్ మీద ప్రత్యక్ష మయ్యారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆయన.. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కలివిడిగా తిరిగారు. వేదికపై ఆయనకు మంచి ప్రాధాన్యమే లభించింది. ప్రముఖుల పక్కనే కుర్చీవేసి కూర్చోబెట్టారు. స్పీచ్ కూడా ఇచ్చారు. అయితే.. ఆ దృశ్యాన్ని చూసి.. తట్టుకోలేకపోయారు విజయశాంతి. నల్లారిని చూడగానే గతం గుర్తుకొచ్చింది. ఆమె బాగా హర్ట్ అయ్యారు. వెంటనే బీజేపీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. ఇంతకీ ఏమైంది? విజయశాంతి ఎందుకంతగా ఇదయ్యారు? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.
కొందరు మీడియా మిత్రులు అడుగుతున్నారంటూ.. ఇంటికెళ్లాక తీరిగ్గా ట్విట్టర్లో అసలు విషయం చెప్పారామె. ట్వీట్లో ఆమె ప్రస్తావించిన టాపిక్ తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
“నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణ వాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం, అసాధ్యం ఆ పరిస్థితి వల్ల ముందుగానే వెళ్లవలసి వచ్చింది”..అంటూ నల్లారి కిరణ్కుమార్ రెడ్డి టార్గెట్గా సంచలన ట్వీట్ చేశారు విజయశాంతి.
నిజమే. మాజీ సీఎం నల్లారిని తెలంగాణ ఉద్యమకారులెవరూ అంతఈజీగా మర్చిపోలేదు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసే ప్రయత్నం చేశారు. పోలీసులతో నిర్బంధకాండ కొనసాగించారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను.. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ నిండు అసెంబ్లీలో అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే కరెంట్ ఉండదని.. రాష్ట్రం చీకటిమయం అవుతుందని శాపనార్థాలు పెట్టారు. ఎక్కడిదో బెర్లిన్ గోడ రాయి ముక్కను తీసుకొచ్చి.. సమైక్యాంధ్ర ఛాంపియన్గా నిలిచారు. ఆయన సీఎం కుర్చీలో ఉన్న చివరి క్షణం వరకూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాయశక్తులా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా, తెలంగాణ సిద్ధించింది. అప్పటినుంచి నల్లారి కూడా రాజకీయంగా కనుమరుగయ్యారు. ఇటీవలే బీజేపీ కండువా కప్పుకుని.. మళ్లీ నేనున్నానంటూ ముందుకొచ్చారు. ఏకంగా జాతీయ కార్యవర్గంలో సీటు సంపాదించుకున్నారు. ఏదో ఏపీలో రాజకీయం చేసుకుంటే బాగుండేదేమో.. ఇలా తెలంగాణ బీజేపీ వేదికపై దర్జాగా కూర్చోవడంతో.. ఆయన్ను చూసి చాలామందే రగిలిపోయి ఉంటారు. విజయశాంతి ఫైర్ బ్రాండ్ లీడర్ కాబట్టి.. ఇలా బాహాటంగానే బయటపడ్డారు కానీ.. ఆనాటి ఉద్యమకారులెవరూ తెలంగాణలో నల్లారి హడావుడిని సహించకపోవచ్చు అంటున్నారు. ఈ పరిణామం బీజేపీకి బాగానే డ్యామేజ్ చేస్తుందని చెబుతున్నారు.