Viveka case latest updates(AP breaking news today) : వివేకా మర్డర్ కేసులో మళ్లీ అప్డేట్స్ వస్తున్నాయ్. సీబీఐ ఛార్జ్షీట్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. అందులో భాగంగా.. గతంలో షర్మిల ఇచ్చిన సాక్ష్యం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. వైఎస్ షర్మిలను 259వ సాక్షిగా కోర్టుకు వాంగ్మూలం సమర్పించింది సీబీఐ. గత అక్టోబర్ 7న ఢిల్లీలో సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు షర్మిల. తన దగ్గర ఆధారాలు లేవు కానీ.. రాజకీయ కారణాలతోనే బాబాయ్ హత్య జరిగిందని తెలిపారు. హత్యకు.. కుటుంబ, ఆర్థిక అంశాలు కారణాలు కాకపోవచ్చని.. మరో పెద్ద కారణమే ఉందని షర్మిల సీబీఐకి చెప్పినట్టు తాజాగా తెలిసింది. సాక్షిగా షర్మిల చెప్పిన విషయం.. పరోక్షంగా అవినాశ్రెడ్డినే టార్గెట్ చేశాయని అంటున్నారు.
మరోవైరు, ఇదే అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రియాక్ట్ అయ్యారు. అబ్బాయే బాబాయ్ని చంపేశాడని.. అది జగనాసుర రక్త చరిత్ర అని షర్మిల కూడా తేల్చేశారని ట్వీట్ చేశారు. బాబాయ్ని చంపింది తన అన్నే కావొచ్చని షర్మిల వాంగ్మూలం ఇచ్చారని.. రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని షర్మిల చెప్పారని అన్నారు. అవినాశ్ కుటుంబానికి వివేకా వ్యతిరేకంగా నిలబడటమే కారణమని షర్మిల వాంగ్మూలం ఇచ్చారని లోకేశ్ ట్వీట్లో ప్రస్తావించారు.