Manipur violence news today(Latest breaking news in telugu): మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసినట్లు ప్రకటించారు. దీంతో ఈ కేసులో అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య నాలుగుకు చేరింది.
అటు ఈ ఘటనపై మణిపూర్ లో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రధాన నిందితుడిగా పోలీసులు ప్రకటించిన హుయిరేమ్ హెరోదాస్ సింగ్ ఇంటిని కొంత మంది తగలబెట్టేశారు. పేచీ అవాంగ్ లైకైలో ఉన్న హోరోదాస్ ఇంటిని చుట్టుముట్టిన కొందరు గ్రామస్తులు.. తాళం వేసిన ఆ ఇంటిని టైర్లతో కాల్చేశారు. ఆపై ఆ కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు నినాదాలు చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు.
ఇప్పటికే ఈ ఘటనపై సుప్రీం కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని ఆదేశించింది. అటు ప్రధాని మోడీ సైతం ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటనను తనను వ్యక్తిగతంగా కలిచివేసిందని పేర్కొన్నారు. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించే లేదని ప్రకటించారు.
మరోవైపు ఘటన జరిగి ఇప్పటికే దాదాపు 2 నెలలు అవుతోంది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారడంతో.. పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ ఘటనపై రియాక్ట్ అయిన పోలీసులు… దాదాపు 63 రోజుల తర్వాత నిందితులను గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మెయితీల గిరిజన హోదా డిమాండ్తో మొదలైన వ్యవహారం.. మే 3న కుకీ-మెయితీల మధ్య ఘర్షణలు మొదలై మణిపూర్ హింసకు ఆజ్యం పోసింది. ఆ సమయంలో ఓ ఫేక్ వీడియో వైరల్ కావడంతో రగిలిపోయిన మెయితీ వర్గం.. కుకీ తెగ వారిపై దాడులకు సిద్ధపడింది. ఈ క్రమంలో మే 4న .. బి ఫైనోమ్ గ్రామంలో కర్రలు చేతపట్టిన సుమారు 800 మంది మెయితీ వర్గానికి చెందిన వారు, కుకీ గిరిజన వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను పోలీసుల నుంచి బలవంతంగా లాక్కెళ్లి.. నగ్నంగా ఊరేగించారు. అడ్డొచ్చిన ఇద్దరిపైనా దాడి చేసి చంపినట్లు తెలుస్తోంది. ఆపై ఆ మహిళలిద్దరినీ ఊరేగించి.. సామూహిక లైంగిక దాడికి కూడా పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికే మణిపూర్ హింసతో అట్టుడుకుతోంది. ఇటీవల మణిపూర్ హైకోర్టు ఆదేశాలనుసారం.. కొన్నిచోట్ల ఇంటర్నెట్ పై విధించిన నిషేధం తొలగించారు. దీంతో ఈ హేయమైన ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇది కాస్తా వైరల్ కావడంతో.. దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది.