Pawan Kalyan latest political news(Andhra pradesh today news): జనసేనానికి వ్యతిరేకంగా పావులు కదుపుతోంది ప్రభుత్వం. వాలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన్ను ప్రాసిక్యూషన్ చేయాలంటూ జీవో జారీ చేసింది జగన్ సర్కార్. విషయం జనసేనానికి తెలిసింది. న్యాయం కోసం మాట్లాడిన తననే ప్రాసిక్యూషన్ చేస్తారా? మరి, మర్డర్ చేసినవారికి ప్రాసిక్యూషన్లు ఉండవా? పొరబాటున మానభంగాలు జరుగుతాయన్న మంత్రులపై ప్రాసిక్యూషన్లు ఉండవా? అని ఫైర్ అయ్యారు. మీరు వేసే వేషాలు కోర్టులు కూడా చూస్తున్నాయంటూ మండిపడ్డారు.
తనను అరెస్ట్ చేసుకోమని.. చిత్రవధ చేసుకోమని.. జైలుకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. దెబ్బలు తినడానికి కూడా సిద్ధమేనని.. తేల్చి చెప్పారు పవన్ కల్యాణ్. తానొక మాట మాట్లాడానంటే.. అన్ని రిస్కులు తీసుకునే మాట్లాడతానని చెప్పారు. ఇలాంటి కేసులకు భయపడే వాడినైతే తాను పార్టీ ఎందుకు పెడతానని అన్నారు.
డేటా ఈజ్ ఆయిల్.. అని వాలంటీర్లు సేకరిస్తున్న డేటా మొత్తం హైదరాబాద్ కంపెనీలో దాస్తున్నారని.. డేటా చౌర్యానికి పాల్పడుతున్నారని.. ఆ డేటాకు ఎవరు బాధ్యుత వహిస్తారని ప్రశ్నించారు పవన్. వాలంటీర్లపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు అధిపతి జగన్ మాత్రమేనన్నారు. ఈ విషయంపై తాను కేంద్ర హోంశాఖమంత్రి అమిత్షాతో కూడా మాట్లాడానని చెప్పారు. మీ ప్రభుత్వానికి మీకు రోజులు దగ్గర పడ్డాయని జగన్ను హెచ్చరించారు జనసేనాని.