Bogatha waterfalls news(Telangana news updates): ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు ఇష్టమైన కాలం వర్షాకాలం. ఈ సీజన్ వచ్చిందంటే చాలు ప్రాజెక్ట్ లు, జలపాతాల దగ్గర సందడి చేస్తుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో వెళ్లి సరదాగా గడుపుతారు. అయితే అలాంటి ఎన్నో ప్రకృతి అందాలు తెలుగురాష్ట్రాల్లో ఉన్నాయి. తెలంగాణలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో ములుగు జిల్లాలో ఉన్న బొగత జలపాతం కూడా ఒకటి. దీన్ని తెలంగాణ నయాగరా అని కూడా పిలుస్తారు. వర్షాకాలం మొదలయ్యింది అంటే చాలు ఇక్కడకు పర్యాటకులు క్యూ కడుంటారు. వరంగల్ హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. ప్రస్తుతం జలపాతం పరవళ్లు తొక్కుతోంది.
గతకొద్ది రోజులుగా కురుస్తోన్న వర్షాలతో బొగత జలపాతానికి వరద పోటెత్తింది. ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాష్ట్రంలో కురుస్తోన్న వర్షాలకు తోడు, ఎగువ ప్రాంతాల్లోనూ భారీ వర్షాల కారణంగా రెండు రోజులుగా ఎగువన ఉన్న వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీని ప్రభావంతో బొగత జలపాతానికి వరద అధిక మొత్తంలో వచ్చి చేరుతోంది. ఫలితంగా జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఈ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తున్నారు. వరద నీటితో ప్రకృతి సోయగాలను తిలకిస్తూ ఆనందంతో మైమరచిపోతున్నారు.
అయితే, జలపాతం ఉధృతి పెరగడంతో సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. పర్యాటకులను వెనక్కి పంపిస్తున్నారు. ప్రమాదాల నివారణ కోసమే ఈ చర్యలు చేపట్టినట్టు చెబుతున్నారు.