Yerravaram news(Local news telangana): సూర్యాపేట జిల్లా యర్రవరం బాల ఉగ్రనరసింహ స్వామి ఆలయంలో ఆక్రమాలపై బిగ్ టీవీ వరుస కథనాలతో పోలీసులు రియాక్ట్ అయ్యారు. యర్రవరం వెళ్లి.. ఆలయ కమిటిని హెచ్చరించారు. భక్తులు సమర్పించే కానుకల విషయంలో అకౌంట్స్ మెయింటెన్ చేయాలన్నారు. బెదిరింపులు, అక్రమాలకు పాల్పడితే.. చర్యలు తప్పవని హెచ్చరించారు కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి.
సూర్యాపేట జిల్లా యర్రవరంలో కొత్తగా వెలిసిన ఉగ్ర నరసింహస్వామి ఆలయం జరుగుతున్న వ్యవహారంపై ఇప్పటికే బిగ్ కథనాలు ప్రకంపనలు సృష్టించాయ్. గత కొద్దీ రోజులుగా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. వారికి తోచినంత విరాళాలు ఇస్తున్నారు. కాని ఇవి ఎవరి జేబులోకి వెళ్తున్నాయ్? అకౌంట్స్ ఎందుకు మెయింటెన్ చేయడం లేదని ప్రశ్నించింది బిగ్ టీవీ. కాని ఆలయ చైర్మన్ జగన్నాథం నుంచి సరైన సమాధానం రాలేదు. అంతేకాదు. బిగ్ టీవీ ప్రతినిధులపై ఆయన అనుచరులు దౌర్జన్యం చేశారు.
నేరుగా కోదాడ డీఎస్పీని కలిసింది బిగ్ టీవీ. జరుగుతున్న అక్రమాలను వివరించింది. దాంతో వెంటనే రియాక్ట్ అయిన డీఎస్పీ.. కోదాడకు పోలీసులను పంపారు. ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపై ఆరా తీశారు.
మరోవైపు తమకు తాము దేవుళ్లుగా ప్రకటించుకున్న నలుగురు వ్యక్తులు పత్తా లేకుండా పోయారు. చైర్మన్ జగన్నాథం అయితే అజ్నాతంలోకి వెళ్లగా.. జగన్నాథం, పండుస్వామి, సాయిస్వామి అందుబాటులో లేకుండా పోయారు.
సూర్యాపేట జిల్లా యర్రవరంలో వెలిసిన ఉగ్రనరసింహ ఆలయం.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆలయం వెలుగులోకి వచ్చి సంవత్సరం దాటుతోంది. స్వామివారి పేరిట జరుగుతున్న వ్యవహారాలన్నీ స్థానికంగా ఏర్పడిన పాలకమండలి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆలయ నిర్వహణతో పాటు.. భక్తుల నుంచి వచ్చే కానుకలు, చెల్లింపులు, దర్శనాల పేరిట వసూలు చేస్తున్న డబ్బు లెక్క లేకుండా పోతోంది. వ్యాపార సముదాయాల నుంచి వచ్చే పన్నులు, పార్కింగ్ వసూళ్ల లెక్కలు అసలే లేవు. ఇక దేవుడి గుడి నిర్మాణ పేరిట కూడా పెద్దమొత్తంలో చందాల వసూళ్లు జరుగుతున్నాయి.
దూళిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా.. ప్రభుత్వం కానీ, దేవాదాయ శాఖ అధికారులు గానీ స్పందించడం లేదు. కోట్లాది రూపాయల దందా జరుగుతున్న అధికార యంత్రాంగం మొత్తం సైలెంట్ కావడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ప్రభుత్వానికి చెందిన బడా నేతలు ఈ వ్యవహారంలో ఉన్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.