Telangana congress leaders meeting(Latest political news telangana) : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు మరింత పెంచింది. ఖమ్మం సభ తర్వాత నేతలు యాక్టివ్ గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో కీలక నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ నేతలు మల్లు రవి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
భవిష్యత్ కార్యచరణ, వ్యూహాలపై కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. ఉచిత విద్యుత్ , పార్టీలో చేరికల అంశంపై సమాలోచనలు జరుపుతున్నారు. కర్ణాటక తరహాలోనే 5 అంశాలతో ప్రజలకు గ్యారంటీ కార్డు హామీ ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తోందని సమాచారం.
ఈ సమావేశానికి ముందు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్లో చేరికలపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. 119 నియోజకవర్గాల్లో పార్టీ నేతలు ప్రచారం చేసేలా ప్లాన్ చేస్తే బాగుంటుందన్నారు. బస్సు యాత్ర చేపట్టాలన్నదే తన సలహా పేర్కొన్నారు.