INDIA Vs NDA(Latest political news in India) :ఈ ఏడాది చివరిలోపు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే 26 విపక్షాలు జట్టు కట్టాయి. బెంగళూరులో రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించి కార్యాచరణ రూపొందించాయి. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయెన్స్.. INDIA పేరుతో 2024 సార్వత్రిక ఎన్నికల బరిలో దిగాలని తీర్మానించాయి.
INDIA ఏర్పాటు నేపథ్యంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్విటర్ బయోలో మార్పు చేయడం ఆసక్తిగా మారింది. హిమంత తన ట్విటర్ బయోలో ఉన్న ఇండియా అనే పదాన్ని తొలగించారు. ఈ పదం స్థానంలో భారత్ అనే పదాన్ని పెట్టుకున్నారు. బ్రిటిష్ వారు మన దేశానికి ఇండియా అని పేరు పెట్టారని హిమంత పేర్కొన్నారు. ఆ వలసవాద వారసత్వం నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి ఇప్పుడు పోరాటం చేయాలని విపక్షాల కూటమిని ఉద్దేశించి విమర్శలు చేశారు. మన పూర్వీకులు భారత్ కోసం పోరాడారు. ఇప్పుడు మనం భారత్ కోసం కృషి చేయాలి. భారత్ కోసమే బీజేపీ ఉంది అంటూ విపక్షాల కూటమికి కౌంటర్ ఇచ్చారు.
హిమంత విమర్శలకు కాంగ్రెస్ దీటుగా బదులిచ్చింది. కాషాయ నేతల మైండ్ బ్లాంక్ అయ్యే కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. ఇండియా పేరుపై అస్సాం సీఎం ఉడికిపోతున్నారని మండిపడ్డారు. హిమంత శర్మ కొత్త మెంటార్.. స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా అని పేర్లు పెట్టారు. ఆ మెంటార్ అన్ని రాష్ట్రాల సీఎంలు కలిసి టీమిండియాలా పనిచేయాలని సూచించారు. ఇండియాకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. విపక్షాలు ఇండియాను ఏర్పాటు చేయగానే హిమంత వలసవాద మనస్తతత్వమని అంటున్నారని అదే విషయాన్ని ఆయన బాస్ మోదీకు చెప్పాలని చురకలు అంటించారు.