Yamuna River news today(Telugu breaking news) : ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. నదీ ప్రవాహం తగ్గుముఖం పట్టిన కొన్నిరోజులకే మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బుధవారం ఉదయానికి నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటేసింది. ఢిల్లీలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో యమునా నది ఉప్పొంగుతోంది.
కేంద్ర జల కమిషన్ సమాచారం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యుమనా నది నీటి మట్టం 205.48 మీటర్లుగా నమోదైంది. సాయంత్రానికి నీటిమట్టం 205.72 మీటర్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతవారం యమునా నీటిమట్టం ఆల్టైమ్ గరిష్ఠానికి చేరింది. ఆ సమయంలో నీటిమట్టం 208.66 మీటర్లుగా నమోదైంది. అప్పుడు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో వరద ముంపునకు గురయ్యాయి.
ఉత్తరాదిలో పలు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. జులై 22 వరకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. గుజరాత్లోనూ రెండు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గిర్ సోమ్నాథ్, కచ్, నవ్సరి, వల్సాద్, అమ్రేలీ, రాజ్కోట్ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. వర్షాలు కురిసే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.