Defamation Case : పరువునష్టం కేసులో సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు షాక్ తగిలింది. వారికి నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.5 వేల జరిమానా విధించింది. రాజశేఖర్, జీవిత దంపతులు 2011లో చిరంజీవి బ్లడ్బ్యాంకుపై అనేక ఆరోపణలు చేశారు. దాతల నుంచి ఉచితంగా సేకరించిన బ్లడ్ ను మార్కెట్ లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
రాజశేఖర్ , జీవిత దంపతులు చేసిన ఆరోపణలపై సినీ నిర్మాత అల్లు అరవింద్ అప్పట్లోనే కోర్టును ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న ట్రస్టు సేవలపై అసత్య ఆరోపణలు చేశారని పేర్కొంటూ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించడంతో అప్పీ ల్ కు అవకాశమిచ్చింది. రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది.
ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో చిరంజీవి, రాజశేఖర్ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ సమయంలో పీఆర్పీపై రాజశేఖర్ కామెంట్స్ చేయడంతో మెగా అభిమానులు ఆయన వాహనాన్ని వెంబడి దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో చిరుపై రాజశేఖర్ దంపతులు విమర్శలు గుప్పించారు. ఆ క్రమంలో 2011లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిర్వహణపై ఆరోపణలు చేశారు.