Andhra Pradesh Political news today(Telugu news live): రాజకీయ పార్టీలు పొలిటికల్ స్ట్రాటజీ టీమ్ లను పెట్టుకోవడం దేశంలో ట్రెండ్గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ టీమ్ ల హవా మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ టీమ్ లు బూత్ స్థాయి నుంచే పార్టీ పరిస్థితిని పసిగడుతున్నాయి. ప్రమాద ఘంటికలు ఏమైనా గుర్తిస్తే వెంటనే సరిచేసుకునేలా సలహాలు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం కూడా సర్వే కోసం రాబిన్ శర్మ బృందాన్ని రంగంలోకి దింపుతోంది. బుధవారం నుంచి రాబిన్ శర్మ బృందం సర్వే చేయనుంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఏపీలో పొత్తుల అంశంపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో బూత్ స్థాయి నుంచి వివిధ అంశాలపై సర్వే టీమ్లు వివరాలు సేకరిస్తాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారు? టీడీపీ సొంతంగా పోటీ చేస్తే పరిస్థితి ఏంటి? టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు రావచ్చు? అనే అంశాలపై ఆరా తీస్తారు. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తే ఫలితం ఎలా రావచ్చు? అనే దానిపై ప్రజాభిప్రాయం తీసుకుంటారు. అలాగే నియోజకవర్గ స్థాయిలోనూ ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల విజయావకాశాలపైనా సర్వే చేస్తారు.
ఇప్పటికే హైదరాబాద్లో రాబిన్ శర్మ బృందం చంద్రబాబుతో భేటీ అయింది. కమలదళంతో కలిసి వెళ్లవద్దని రాబిన్ శర్మ టీమ్ గతంలోనే స్పష్టం చేసింది. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ సమ ఉజ్జీలుగా ఉన్నాయని తెలిపింది. మరోసారి అన్ని అంశాలపై లోతుగా సర్వే చేసి మరోసారి RS టీమ్ చంద్రబాబుకు రిపోర్ట్ చేయనుంది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంది. యువగళం పేరుతో లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహియాత్రతో వైసీపీపై విరుచుపడుతున్నారు. బీజేపీలో అధ్యక్ష మార్పు జరిగింది. జనసేన-బీజేపీ కలిసి పనిచేయడం కన్ఫామ్ అయింది. ఎన్డీఏ మీటింగ్కు పవన్ కూడా హాజరయ్యారు. ఈ పరిణామాలతో అసలు బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందా అని రాజకీయ వర్గాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ జనసేన-బీజేపీ కలిసి పోటీచేస్తే పరిస్థితి ఏంటని టీడీపీలో కొంత గందరగోళం నెలకొంది.
బీజేపీ.. టీడీపీకి నో చెబితే పవన్ ఏ స్టాండ్ తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. ఒకవేళ టీడీపీ-జనసేన మధ్యే పొత్తు ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి.? ప్రజల నుంచి రెస్పాన్స్ ఏంటి అనేది తేలాలి. టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగితే జనం నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుందనేది తెలుసుకోవాల్సి ఉంది. ఇలా అన్ని కోణాల్లోనూ రాబిన్ శర్మ బృందం సర్వే చేసి ఎలాంటి ఆప్షన్తో వెళ్తే బెస్ట్ రిజల్ట్ వస్తుందనే క్లారిటీ ఇవ్వనుంది.
పొత్తులు విషయంలోనూ టీడీపీ కొన్ని స్థానాలను వదులుకోవాల్సి వస్తుంది. అయితే ఏఏ స్థానాల్లో ఎవరు బలంగా ఉన్నారనేది కూడా RS టీమ్ తేల్చనుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా సీట్ల సర్ధుబాటు జరిగే అవకాశాలు లేకపోలేదు. అలాగే కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అలాంటి వాటికి కూడా RS టీమ్ పరిష్కారం చూపనుంది. అభ్యర్థుల బలాబలాలను కూడా అంచనా వేసి ప్రజా స్పందనపై నివేదిక అందజేయనుంది. అధికార పార్టీ ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం.. జగనన్న సురక్ష లాంటి కార్యక్రమాలతో ప్రజల్లో స్పందన తెలుసుకుంటోంది. ఎప్పటికప్పుడు ప్రజా వ్యతిరేకతను అంచనా వేసి మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు ఎత్తుగడలు వేస్తోంది. అదే క్రమంలో టీడీపీ కూడా బూత్స్థాయి సర్వేకు శ్రీకారం చుడుతోంది.