Parliament session : గురువారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష భేటీని నిర్వహించనుంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. అయితే అదే రోజు ఢిల్లీలో పాలకపక్ష పార్టీలు, బెంగళూరులో ప్రతిపక్షాలు సమావేశాలు నిర్వహించుకున్నాయి. దీంతో అఖిల పక్ష భేటీని బుధవారానికి వాయిదా వేశారు.
మరోవైపు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ పక్ష నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, కొందరు మంత్రులతో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఐదు రాష్ట్రాల్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ఆసక్తిగా మారాయి.
పార్లమెంట్ వర్షాకాల సెషన్ వాడీవేడిగా కొనసాగే అవకాశముంది. అధికార, ప్రతిపక్ష కూటములు పలు అంశాలపై పరస్పరం ఆరోపణలు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నాయి. మణిపూర్ లో హింస, ధరల పెరుగుదల, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం లాంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని విపక్షాల నేతృత్వంలోని INDIA యోచిస్తోంది. ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ ఎలా కౌంటర్ ఇస్తుందనేది ఆసక్తిగా మారింది.
ఆగస్టు 11 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. మొత్తం 17 రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తారు. తొలుత పాత పార్లమెంట్ భవనంలో పార్లమెంట్ సెషన్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కొత్త పార్లమెంట్ భవనంలోనూ కొన్ని రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తారని తెలుస్తోంది.