YSRCP latest updates(Political news in AP): రామచంద్రాపురం టిక్కెట్ వార్ వైసీపీలో కాక రేపుతోంది. బోస్, వేణు వర్గాల మధ్య రాజుకున్న చిచ్చు హైకమాండ్ వరకు చేరింది. ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరులోకి ఏకంగా సీఎం జగనే.. ఎంటర్ కావాల్సి వచ్చింది. అసలు పిల్లి సుభాష్ చంద్రబోస్, చెల్లుబోయిన వేణు మధ్య వార్ ఏంటి? పిల్లి రికమండేషన్స్ ఏంటి? వేణు డిమాండ్స్ ఏంటి? అసలు రామచంద్రాపురంలో ఏం జరుగుతోంది?
కొంతకాలంగా మంత్రి వేణు వర్సెస్ ఎంపీ బోస్ అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. టిక్కెట్ తమకంటే తమకే దక్కుతుందంటూ ఎవరి రాజకీయాలు వారు చేసుకుంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం బోస్ వర్గీయులు నిర్వహించిన సమావేశం.. తాజా వివాదానికి ఆజ్యం పోసినట్లైంది. ఆ సమావేశంలో.. ఎంపీ పిల్లి అనుచరుడిగా మున్సిపల్ వైస్ ఛైర్మన్ శివాజీ చొక్కాను.. మంత్రి వేణు అనుచరుడు పట్టుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అదీ మంత్రి సమక్షంలో జరగడంతో.. ఇద్దరి నేతల మధ్య వైరం ఎంతవరకు వచ్చిందో తేలిపోయింది. అయితే ఈ ఘటనపై తీవ్ర అవమానభారంతో శివాజీ ఆత్మహత్యకు ప్రయత్నించడంతో పరిస్థితి సీరియస్ గా మారింది. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది.
దీంతో ఈ ఇష్యూ మరింత ముదరకముందే హైకమాండ్ ఎంటర్ అయ్యింది. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కు క్యాంప్ ఆఫీస్ కు రావాలని పిలుపు రావడంతో.. హుటాహుటిన వెళ్లి సీఎం జగన్ తో సమావేశమయ్యారు. దాదాపు అరగంటకు పైగా సాగిన సమావేశంలో రామచంద్రాపురంలో చోటు చేసుకున్న పరిణామాలపై జగన్ కు పిల్లి సుభాష్ చంద్రబోస్ వివరించారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తీరుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సందర్భంగా.. వచ్చే ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలనే విషయాన్ని హైకమాండ్ కు వదిలేయాలని పిల్లికి జగన్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. సీఎంతో సమావేశం తర్వాత ఎంపీ మిథున్ రెడ్డితో సమావేశమైన పిల్లి.. మంత్రితో గ్యాప్ పెరగడానికి కారణాలను వివరించారు. అయితే టిక్కెట్ విషయంలో పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పిల్లి సుభాష్ చంద్రబోస్ హామీ ఇచ్చినట్లు ప్రచారం అయితే సాగుతోంది.
రామచంద్రాపురం నియోజకవర్గంలో ఈ ఇద్దరు నేతల వైరం ఇప్పటిది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో రామచంద్రపురం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రెండు సార్లు నెగ్గిన పిల్లి సుభాష్ చంద్రబోస్.. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున మండపేట నియోజకవర్గానికి వెళ్లాల్సివచ్చింది. బోస్ సొంత నియోజకవర్గం అయిన రామచంద్రపురంలో.. రాజోలు నియోజకవర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బరిలోకి దిగారు. అయితే మండపేటలో బోస్ ఓడిపోతే.. రామచంద్రపురంలో వేణు విజయం సాధించారు. అయితే సొంత నియోజకవర్గంలో ఎలాగైనా పట్టుసాధించాలనే లక్ష్యంతో తన కుమారుడు సూర్యప్రకాశ్ కు టిక్కెట్ ఇవ్వాలని బోస్ పట్టుబడుతున్నారు. అయితే గతంలోనే నియోజకవర్గ కోఆర్డినేటర్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి ఈ సారి టిక్కెట్ మంత్రి చెల్లుబోయిన్ కే అని తేల్చిచెప్పడంతో.. వివాదం మళ్లీ మొదటికొచ్చింది. దీంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్.. అధిష్టానం టిక్కెట్ ఇవ్వకుంటే.. ఇండిపెండెంట్ గానైనా తన కుమారుడిని బరిలోకి దింపాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెబుతున్నారు.