Mother: అప్పట్లో అర్జున్-శంకర్ల కాంబినేషన్లో వచ్చిన జెంటిల్మేన్ సినిమాలో ఓ సీన్ ప్రేక్షకులతో కన్నీరు పెట్టించింది. కొడుకు ఫీజు కట్టేందుకు డబ్బులు అవసరమై.. ఓ తల్లి ఒంటికి నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకునే సీన్ ఆడియన్స్ను కదిలించేసింది. అచ్చం అలాంటి ఘటనే.. ఇప్పుడు రియల్గానూ జరిగింది. దశాబ్దాలు మారుతున్నా పేదరికం చాయలు పోకపోవడం.. చదువులు మరింత ఖరీదు అవడంతో.. ఓ అభాగ్యురాలు ప్రాణత్యాగం చేయాల్సిన దుస్థితి దాపురించింది.
తల్లి ప్రేమకు ఎల్లలు లేవు. పిల్లల కోసం చేసే త్యాగానికి హద్దులు లేవు. ఇదే నానుడిని నిజం చేసింది తమిళనాడులోని ఓ తల్లి. తన కుమారుడి చదువు కోసం ఏకంగా ప్రాణాన్ని బలి చేసుకుంది. తమిళనాడులోని సేలంకు చెందిన పాపతి అనే ఓ తల్లి.. తన కుమారుడి స్కూల్ ఫీజు కోసం బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.
కుమారుడి చదువు కోసం స్కూల్ లో ఫీజు చెల్లించేందుకు పాపతికి.. 45వేల రూపాయలు అవసరమయ్యాయి. ఎంత ప్రయత్నించినా.. ఆ తల్లికి సకాలంలో డబ్బు అందలేదు. అయితే ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబానికి తమిళనాడు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని ఆమె బంధువుల ద్వారా తెలుసుకుంది. వెంటనే ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వెళ్లి ప్రాణత్యాగానికి సిద్ధపడింది.
తన ఆత్మహత్యతో వచ్చే డబ్బుతో తన కుమారుడు గొప్ప చదువులు చదవాలని తాపత్రయపడింది. గత నెల 28న సేలంలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.