UPA renamed as INDIA(Bangalore opposition parties meeting updates): వారెవా. INDIA. విపక్షాల కూటమికి ఖతర్నాక్ పేరు పెట్టారు. యూపీఏ కూటమి కొత్త పేరు ఇండియా. ఇన్నాళ్లుగా ఉన్న యూపీఏ స్థానంలో ఇకపై INDIA-‘ఇండియా నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్’ కానుంది. కొత్త పేరుతో.. కొత్త ఎజెండాతో.. 26 ప్రతిపక్ష పార్టీలు జట్టు కట్టాయి. బీజేపీని గద్దె దించడమే మెయిన్ టార్గెట్. ఇండియా కూటమిని సక్సెస్ఫుల్గా రన్ చేసేలా.. త్వరలో 11 మందితో కోఆర్డినేటర్స్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేసేలా ఓ ఉమ్మడి కార్యాచరణ ప్రకటించనున్నారు. INDIA నెక్ట్స్ మీటింగ్ ముంబైలో ఉంటుందని ప్రకటించారు ఖర్గే. కొత్త కూటమికి సోనియాగాంధీయే ఛైర్ పర్సన్గా, నితీష్ కుమార్ కన్వీనర్గా ఉంటారని తెలుస్తోంది.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీకి అధికారం కావాలని గానీ.. లేదంటే ప్రధాని పదవి మీద వ్యామోహం కానీ లేదని AICC అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గే స్పష్టం చేశారు. కేవలం అధికారంలోకి రావడమే తమ ఉద్ధేశ్యం కాదన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని పరిరక్షించడమే తమ కర్తవ్యమన్నారు. రాష్ట్ర స్థాయిలో కొన్ని విబేధాలు ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. అయితే అవి సిద్ధాంతపరమైనవి కావన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల ముందు అది అసలు పెద్ద విషయం కాదన్నారాయన. 26 పార్టీలకు చెందిన ఐక్య కూటమిలో 11 పార్టీలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయని చెప్పారు. ఓట్ల కోసం మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి రాగానే వాళ్లను వదిలేయడం బీజేపీ నైజమని మండిపడ్డారు. ఎన్డీఏ మీటింగ్పైనా వ్యంగ్యంగా స్పందించిన ఖర్గే.. పాత మిత్రుల కోసం పరుగులు పెడుతున్నారని విమర్శించారు. ఎన్టీయే కూటమిలో 38 పార్టీలు ఉన్నాయంటూ మోదీ చేసిన కామెంట్లపైనా పంచ్లు వేశారు ఖర్గే. ఆ పార్టీల పేరు తానెప్పుడూ వినలేదని, ఆయా పార్టీలు ఉన్నట్టు కూడా తెలీదంటూ ఎద్దేవా చేశారు.
INDIA సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు రెండు రోజుల పాటు సమావేశాలు జరిపాయి. 26 ప్రతిపక్ష పార్టీలు మీటింగ్కు హాజరయ్యాయి. సమావేశం అనంతరం ప్రతిపక్ష పార్టీలన్నీ ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించాయి. తమ ఇండియాను ఢీకొనే సత్తా ఎన్డీయేకు ఉందా? అంటూ సవాల్ విసిరాయి. బీజేపీ దేశాన్ని ఆక్రమించేస్తోందని.. సంపద కొద్దిమంది చేతుల్లోకే వెళ్తోందని అన్నారు రాహుల్గాంధీ. కేవంల బీజేపీని అడ్డుకోవడానికే కాకుండా.. దేశం కోసం తమ కూటమి పని చేస్తుందని చెప్పారు.
NCP వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ మొదటి రోజు సమావేశానికి హాజరుకాలేదు. అయితే రెండో రోజు మీటింగ్ రావడంతో సస్పెన్స్కు తెరపడింది. సమావేశంలో పాల్గొనేందుకు తన కుమార్తె సుప్రియా సూలేతో కలిసి చార్టర్డ్ విమానంలో ఉదయం ముంబై నుంచి బెంగళూరుకు వచ్చారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమావేశానికి హాజరయ్యారు. ఝార్ఘండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సమావేశానికి అటెండ్ అయ్యారు.
బీజేపీని ఢీ కొట్టేందుకు లోక్సభ స్థానాల్లో ప్రతిపక్షాల నుంచి ఒకే అభ్యర్థిని బరిలో దింపాలనే అంశంపై క్లారిటీకి రానున్నారు. గత బిహార్ భేటీతో పాటు నితీశ్ కుమార్, రాహుల్, ఖర్గే సమావేశాల్లోనూ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు ముఖ్యనేతలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓట్లు చీలకుండా బీజేపీని ఢిల్లీ గద్దె దింపాలనేది విపక్షాల వ్యూహంలో ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది.