Yerravaram pandu swamy(Telangana today news) : మోసపోయే వాళ్లు ఉన్నన్ని రోజులు.. మోసం చేసేవాళ్లు ఉంటారు. మీ బలహీనతే.. మోసంచేసే వారి బలం. భక్తుల నమ్మకమే వారి పెట్టుబడి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ యర్రవరం గ్రామంలో జరుగుతున్న తాజా ఎపిసోడ్. ఇంతకీ యర్రవరం గ్రామంలో ఏం జరుగుతోంది..?
యర్రవరం.. సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గర 250 కుటుంబాలు ఉండే ఒక మారుమూల గ్రామం. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. అసలు ఏంటీ ఈ గ్రామం ప్రత్యేకత అనుకుంటున్నారా? . ఇప్పుడు జనం తండోపతండాలుగా యర్రవరానికి ఎందుకు వస్తున్నారో తెలుసా ? ఈ గ్రామంలోని దూళ్లగుట్టపై బాలఉగ్రనరసింహస్వామి స్వయంభుగా వెలియడంతో ఆ గ్రామానికి అంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.
ఉగ్రనరసింహస్వామిని దర్శించుకోవడానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తున్నారు. శుక్రవారం అసలు రద్దీ మాములుగా ఉండటం లేదు. ఇక వీకెండ్స్ అయితే ఇసుక వేస్తే రాలనంత జనం అక్కడ కనిపిస్తున్నారు. యాదాద్రి ఎంత ఫేమస్గా మారిందో.. దాన్ని బీట్ చేసేలా ఉంది ఇప్పుడు యర్రవరం బాలఉగ్రనరసింహస్వామి ఆలయం.
అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. స్వామి వెళిశాడని ఒకరు చెప్తే.. మరొకరు వెలికితీసిన వారు.. ఇంకొకరు గుడి కడతానని ముందుకొచ్చిన వారు. ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు.. వారి కుటుంబాలు స్వామి వారిని క్లెయిమ్ చేసుకుంటున్నాయి. దేవుడు నాలో ఉన్నాడంటే.. కాదు నాలోనే ఉన్నాడంటూ వారు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.
ఇప్పడు ఒక్కొక్కరు ఒక్కో స్థావరం ఏర్పాటు చేసుకుని తామే దేవుళ్లమంటూ కొత్త దందాకు తెరలేపారు. ఒకరేమో దేవుడు వాక్కు నాతో చెప్పిస్తున్నాడంటూ ఇంట్లోనే వాక్కు చెప్తూ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. మరొకరు దేవుడిని వెలికి తీసింది తానే అంటూ పండుస్వామిగా మారిపోయారు. ఇంకొకరు గుడి కట్టించడానికి ముందుకొచ్చి.. రోజూ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడని చెప్తూ గుడిని తన కనుసన్నల్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
అయితే మొదటగా స్వామి దూళ్లగుట్టలో వెళిశారని చెప్పింది తానే అంటున్న నాగమణిని ఆలయంలోకి ప్రవేశం నిషేధించారు. దేవుడి వాక్కు చెప్తానంటూ భక్తుల నుంచి భారీ స్థాయిలో డబ్బులు గుంజుతున్నారంటూ ఆలయ కమిటీ ఆమెను గుడి దగ్గరకు రానీయకుండా చేశారు. అయితే నాగమణిని గుడి దగ్గరకు రాకుండా చేయడంలో ఛైర్మన్ జగన్నాథం పన్నాగం ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. భక్తులు తన దగ్గరకు కూడా వస్తుండటంతో ఓర్వలేక న కక్షగట్టారన్నది నాగమణి ఆరోపణ. దీంతో ఇంటి వద్దే వాక్కు చెబుతూ నాగమణి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జగన్నాథం పక్కా స్కెచ్ తోనే ఆమెను పక్కన పెట్టించారని స్థానికులు అంటున్నారు.
మరోవైపు పండు స్వామిగా అవతారమెత్తిన బాలుడిది ఇంకో స్టోరీ. ఉగ్రబాలనరసింహుడు అవతారం ఎత్తి స్వయంభుగా వెలసిన స్వామిని వెలికితీసిన తమకు ఆలయ కమిటీ వారు కనీస మర్యాద ఇవ్వడంలేదని బాలుడి తల్లిదండ్రులు అంటున్నారు. స్వామి వెలసినప్పటి నుంచి దాదాపు 5 నెలలపాటు స్వామికి 108 బిందెలతో నీళ్లు పోయడమే కాకుండా పూజ చేస్తూ వచ్చేవారు. అయితే ఒక రోజు సడన్గా ఇక మీదట స్వామి దగ్గర పూజ చేయడానికి రావద్దని చెప్పి మరో వ్యక్తిని తీసుకొచ్చి స్వామివారి అవతారం ఈయనే అంటూ చెప్పారంటున్నారు.
అయితే ఒకప్పటి పండు స్వామి వేరు.. ఇప్పటి పండు స్వామి వేరు అంటున్నారు పాలకమండలి ఛైర్మన్ జగన్నాథం. పండుస్వామి గుట్టపై కూర్చుని భక్తులకు నిమ్మకాయలు ఇస్తూ లక్షలు సంపాదించారని ఆరోపిస్తున్నారు. ఇలా ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గ్రామం పరువును బజారుకీడుస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు.
ఆలయం డెవలప్ మెంట్ పై దృష్టి పెట్టకుండా సంపాదన మీదే వీరికి మక్కువ ఉందంటున్నారు స్థానికులు. అసలు యర్రవరంలో స్వామి వెలిశాడని తెలియడంతో అక్కడ వ్యాపారం చేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు వ్యాపారులు. కొబ్బరికాయలు, పూజ సామాగ్రి, కంకణాలు, టిఫిన్స్ సెంటర్లు ఇలా పెద్ద వ్యాపారమే నడుస్తోంది. స్వామి వెలసిన దూళ్లగుట్ట పరిసరాలను కమర్షియల్గా మార్చేసి దండుకుంటున్నారు.
యర్రవరంలో బాలఉగ్రనరసింహ స్వామిని దర్శించుకోవడం కోసం రోజూ కనీసం 10 వేల మందికిపైగా వస్తున్నారని అంచనా. ఇలా ఈ గ్రామం ఫుల్ ఫేమస్ అయిపోయింది. దీంతో గుడి చుట్టూ ఉన్న భూముల ధరలకు అనూహ్యంగా రెక్కలొచ్చాయి. గతంలో కేవలం 10 లక్షల లోపు ఉండే ఎకరా భూమి ఇప్పుడు ఏకంగా ఎకరా కోటిన్నర పలుకుతోంది. దీంతో మరోపక్క భూదందాలు నడుస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి.