Sonia Gandhi latest news(Opposition parties meet in bangalore): వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు దాదాపు విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. బెంగళూరు వేదికగా సోమవారం విపక్షాల తొలిరోజు భేటీ జరిగింది. రెండోరోజు ఈ సమావేశం కొనసాగుతోంది. తొలిరోజు సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా 26 పార్టీల నేతలు హాజరయ్యారు.
తొలిరోజు వివిధ అంశాలపై చర్చించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలే ప్రధాన ఎజెండాగా సమాలోచనలు చేశారు. విపక్షాల కూటమికి ఛైర్పర్సన్ గా సోనియా గాంధీకి బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మంగళవారం సాయంత్రం కీలక ప్రకటన వెలువడుతుందని సమాచారం.
కనీస ఉమ్మడి ప్రణాళిక రూపకల్పన, సంయుక్త ఆందోళనల నిర్వహణ లక్ష్యంగా విపక్ష నేతలు తొలిరోజు చర్చించారు. మంగళవారం జరిగే సమావేశంలో ప్రతిపక్షాల కూటమికి పేరును నిర్ణయిస్తారు. ఆ తర్వాత విపక్షాల ఫ్రంట్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీని ఎన్నుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ కూటమికి కన్వీనర్గా బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను నియమిస్తారని తెలుస్తోంది.
విపక్ష కూటమిలోని పార్టీల మధ్య సమన్వయం, కనీస ఉమ్మడి ప్రణాళిక ఖరారులో కీలకంగా వ్యవహరిస్తారని భావించిన ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ పార్టీలో చీలిక నేపథ్యంలో ఆ వ్యవహారాల్లోనే తలమునకలై ఉన్నారు. సోమవారం చీలిక వర్గం నేత అజిత్ పవార్ మరోసారి శరద్ పవార్ను కలవడం ఆసక్తిని రేపింది. రెండో రోజు విపక్షాల భేటీకి శరద్ పవార్ కూడా హాజరయ్యారు.