Rain news in telangana(TS news updates) : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. మంగళవారం భారీ వానలు పడతాయని హెచ్చరించింది. బుధవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఇప్పటికే ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. గురు, శుక్రవారాల్లోనూ భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ పేర్కొంది.
బుధవారంలోగా బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. మరోవైపు ఝార్ఖండ్ దక్షిణ ప్రాంతంపై 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆ ఆవర్తనాల ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అందువల్లే భారీ వానలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ సహా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి.
సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు తెలంగాణళో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మెండోరాలో 1.9 సెంటీమీటర్లు ,
నిర్మల్ జిల్లా భైంసాలో 1.2 సెంటీమీటర్లు, జగిత్యాల జిల్లా గోధూరులో 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.