Assembly : ఏపీ శాసనసభలో పలు కమిటీలను ఏర్పాటు చేశారు. శాసనసభ- శాసన మండలి సభ్యులతో కూడిన సంయుక్త కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రివిలేజ్ కమిటీకి ఛైర్మన్గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి నియమితులయ్యారు. అసెంబ్లీ కమిటీలు, జాయింట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ పీపీకే రామాచార్యులు ప్రకటన విడుదల చేశారు.
ఇప్పటి వరకు ప్రివిలేజ్ కమిటీకి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఛైర్మన్గా ఉన్నారు. కాకాణికి మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆ స్థానంలో భూమన కరుణాకర్రెడ్డిని ఇప్పుడు నియమించారు. ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, కోన రఘుపతి, అబ్బయ్య చౌదరి, సుధాకర్బాబు, వెంకట చినఅప్పలనాయుడు, అనగాని సత్యప్రసాద్ కు ప్రివిలేజ్ కమిటీలో సభ్యులుగా అవకాశం కల్పించారు.
ఎథిక్స్ కమిటీ ఛైర్మన్గా శిల్పా చక్రపాణిరెడ్డిని, రూల్స్ కమిటీ ఛైర్మన్గా స్పీకర్ తమ్మినేని సీతారాంను, పిటిషన్స్ కమిటీ ఛైర్మన్గా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిని, హామీల కమిటీ ఛైర్మన్గా కైలే అనిల్ కుమార్ ను నియమించారు. శాసన సభ, మండలికి సంబంధించి పలు జాయింట్ కమిటీలను ఏర్పాటు చేశారు.
సౌకర్యాలు, వన్యప్రాంత, పర్యావరణ సంరక్షణ కమిటీకి తమ్మినేని సీతారాంను ఛైర్మన్ గా నియమించారు. ఎస్సీ సంక్షేమ కమిటీకి గొల్ల బాబూరావు, ఎస్టీ సంక్షేమ కమిటీకి తెల్లం బాలరాజు, మైనారిటీల సంక్షేమ కమిటీకి మహమ్మద్ ముస్తఫా ఛైర్మన్లగా అవకాశం దక్కించుకున్నారు. స్త్రీ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ కమిటీకి జొన్నలగడ్డ పద్మావతిని, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ను, బీసీ సంక్షేమ కమిటీకి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ను, గ్రంథాలయాలపై కమిటీకి ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిని ఛైర్మన్లుగా నియమించారు.