NDA meeting in Delhi(Latest political news in India) : బెంగళూరులో పీడీఏ మీటింగ్. పోటీగా ఢిల్లీలో ఎన్డీఏ భేటీ. కమలదళం వేగంగా చక్రం తిప్పుతోంది. పాతమిత్రులను కరివేపాకులా పక్కనపెట్టేసిన బీజేపీ.. ఇప్పుడు కొత్తగా రారమ్మంటూ అక్కున చేర్చుకుంటోంది. తాజా, ఎన్డీయే భేటీకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విచిత్ర పరిస్థితి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి పాత మిత్రుడైన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందలేదు. ఒక్క ఎమ్మెల్యే గానీ, ఎంపీగానీ లేని పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి పిలుపు వచ్చింది. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తారనే ప్రచారం జరుగింది. ఇటీవల చంద్రబాబును కూడా అమిత్ షా ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడారు. ఆ తర్వాత బాబు, పవన్ పొత్తులపై పెద్దగా స్పందిచడం లేదు. ఢిల్లీ ఎన్డీఏ భేటీకి బాబుకు ఆహ్వానం అందకపోవడం చూస్తుంటే ఏపీలో పొత్తు లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
వైసీపీ మాత్రం ముందునుంచి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కూటములకు సమదూరం అని చెబుతోంది. అయితే జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన పట్ల వ్యవహరించిన తీరుతో హస్తం పార్టీకి దగ్గరయ్యే అవకాశాలు లేవనేది రాజకీయ విశ్లేషకుల మాట. అలాగే ఏపీలో ఎలాగో బలపడే అవకాశాలు లేనందున వైసీపీ-బీజేపీ మధ్య రహస్య బంధం ఉందనే చర్చ కొత్తదేం కాదు.
మరోవైపు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా జాతీయ పార్టీగా కాంగ్రెస్-బీఆర్ఎస్కు సమదూరం అని చెబుతున్నారు. బీఆర్ఎస్ భవితవ్యంపై ఇటీవల రాహుల్ గాంధీ ఖమ్మం టూర్లో క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ను తాము విపక్ష భేటీలకు ఆహ్వానించడం లేదని కుండబద్దలు కొట్టారు. అలాగే బీఆర్ఎస్.. బీజేపీ బీటీమ్ అని స్పష్టం చేశారు. కేసీఆర్ పార్టీతో కాంగ్రెస్కు ఎలాంటి పొత్తులు ఉండబోవని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్-బీజేపీకి దగ్గరవుతుందనే సంకేతాలు కూడా ఇటీవల వచ్చాయి. కేటీఆర్ కేంద్ర మంత్రులను కలవడం అనుమానాలకు తావిచ్చేలా చేసింది.
ఎన్డీఏ మీటింగ్కు కేసీఆర్కు ఆహ్వానం అందకపోవడం వెనక రహస్య వ్యూహమే కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ బలంగా లేనిచోట కాంగ్రెస్ను దెబ్బకొట్టే ఎత్తుగడలో భాగమేనని అంటున్నారు. ఇప్పటికే మజ్లిస్ పార్టీ కూడా బీజేపీకి బీటీమ్ అనే ఆరోపణలు ఉన్నాయి. హిందూ ఓట్లు కమలం పార్టీకి పడేలా.. మైనార్టీల ప్రభావం ఉన్నచోట్ల విపక్షాలకు ఆ ఓట్లు పడకుండా అసదుద్దీన్ చీలుస్తున్నారనే రాజకీయ విమర్శలు ఉన్నాయి.
మరోవైపు నిన్న మొన్నటిదాకా కేసీఆర్ దోస్తీ పార్టీగా ఉన్న కర్ణాటకలోని జేడీఎస్ ఎన్డీఏలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ఆ పార్టీ అగ్రనేత కుమారస్వామి పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే కూటమి లేదంటే బీ టీమ్ అనే ఫార్మూలాను బీజేపీ గట్టిగానే అమలు చేస్తోందనే వాదనలు ఉన్నాయి. లేదంటే వాషింగ్ పౌడర్ నిర్మా తరహాలో కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి.. వాళ్లు కమలం గూటికి చేరడమో లేదంటే మోడీకి జై కొట్టడమో చేసిన తర్వాత క్లీన్ చిట్ లభిస్తోందనే విమర్శలు పెరుగుతున్నాయి. మొత్తానికి 2024 సాధారణ ఎన్నికలకు ఎడాది ముందే దేశంలోని రెండు ప్రధాన కూటములు అలర్ట్ అవుతున్నాయి.