Pawan Kalyan news live(Breaking news in Andhra Pradesh): జనసేన అధినేత పవన్కల్యాణ్ తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డిని కలిశారు. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్పై ఫిర్యాదు చేశారు. తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు జనసేనాని చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుపతికి వచ్చారు. జనసేన కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయి చెంపలపై సీఐ అంజూ యాదవ్ కొట్టారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. కొట్టే సాయిని సీఐ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే పవన్ తిరుపతి వెళ్లి జిల్లా ఎస్పీని కలిసి సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటన జరిగిన వెంటనే పవన్ కల్యాణ్ స్పందించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వ్యక్తిపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. జనసైనికుడు సాయికి న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ సీఐపై ఫిర్యాదు చేశారు.
జనసేన కార్యకర్తపై సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్న తర్వాత పోలీసు ఉన్నతాధికారులు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనపై నివేదికను ఉన్నతాధికారులు డీఐజీకి పంపారు. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి విచారణ జరిపి డీజీపీకి నివేదిక అందించారు. అలాగే అంజూ యాదవ్కు చార్జ్ మెమో జారీ చేశారు.