Pulasa Fish cost in AP(Telugu news updates): పుస్తెలు అమ్మి అయినా సరే పులస కూర తినాలనేది సామెత. గోదావరి జిల్లాల్లో పులస చేపలకు ఎంతో ప్రత్యేక ఉంది. గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలోనే పులసలు లభ్యమవుతాయి. ఈ ఏడాది మార్కెట్లోకి మొదటి పులస వచ్చేసింది. భారీ రేటుకు అమ్ముడుపోయింది.
కేంద్రపాలిత ప్రాంతం యానాంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఈ సీజన్ లో తొలి పులస వలకు చిక్కింది. ఈ చేప 2 కేజీల బరువు ఉంది. ఈ పులస రూ.15 వేలకు అమ్ముడుపోయింది.
ఉభయగోదావరి జిల్లాల నుంచే కాకుండాహైదరాబాద్ నుంచి పులసలు కొనుగోలు చేసేందుకు జనం వస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా పులస చేపను తినాలని భావిస్తుంటారు. నదీ ప్రవాహానికి ఎదురీదడం పులస ప్రత్యేకత. యానాం, కోటిపల్లి ప్రాంతాల్లో పులసలు ఎక్కువగా లభ్యమవుతాయి. ఎంత రేటైనా కొనుగోలు చేసేందుకు జనం ఎగబడతారు. కొన్నిసార్లు వేలం వేసి మరీ ఈ పులసలను అమ్ముతారు.
పులసలు గోదావరి నదిలో మాత్రమే లభిస్తాయి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం పులసలు ఎదురీదుకుంటూ వస్తాయి. అందుకే జూన్ నుంచి ఆగస్టు నెలల మధ్య పులసలు దొరుకుతాయి.
గుడ్లు పెట్టిన తర్వాత మళ్లీ అక్టోబర్ నాటికి పులసలు సముద్రంలో ప్రవేశిస్తాయి. గోదావరి వరదనీటిలో గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి గోదావరి సముద్రంలో కలిసే మధ్య ప్రాంతంలో పులసలు దొరుకుతాయి. పులస పులుసుతో భోజనం చేస్తే ఆ కిక్కే వేరు అని గోదావరి జిల్లాల్లో అంటుంటారు.