Amaravati r5 zone news(AP breaking news today): అమరావతి ఆర్-5 జోన్పై సోమవారం ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం 17 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. మధ్యాహ్నం 12 గంటలలోపు తీర్పు ఇచ్చే అవకాశముంది.
మరోవైపు ఆర్- 5 జోన్లో ఇప్పటికే పేదలకు ఇచ్చిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఓవైపు కోర్టు తీర్పు పెండింగ్ లో ఉండగానే…. ఈనెల 24న సీఎం జగన్ అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపనకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేపట్టాలని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే హైకోర్టు ఇచ్చే తీర్పు బట్టే… సీఎం శంకుస్థాపన ఉండే అవకాశముంది.
అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తూనే, మరోవైపు ఇళ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టాలని తీర్మానించింది. మరోవైపు కేంద్రం ఈ ఇళ్ల నిర్మాణాలకు నిధులిచ్చే విషయంలో కొర్రీలు పెట్టింది. కోర్టు కేసులు తేలాకే కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశముంది. ముందు శంకుస్థాపనలు చేసి ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టాలనే ఆలోచన చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. బ్యాంకు రుణాల ద్వారా పని ప్రారంభించాలని భావిస్తోంది.
గతంలో సీఆర్డీఏ చట్టంలో నాలుగు జోన్లు మాత్రమే ఉన్నాయి. వీటికి అదనంగా ఐదో జోన్ను ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం. ఐదోజోన్లో కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులోని 900 వందల ఎకరాలను ఆర్-5 జోన్గా ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసింది. సీఆర్డీఏ చట్టంలో ఎలాంటిమార్పులు చేయకూడదన్న కోర్టు తీర్పు ఉన్నా సీఆర్డీఏ చట్టంలో సవరణలు చేసింది ప్రభుత్వం. ఈ సవరణల ప్రకారం రెండు అధికారాలు సీఆర్డీఏకు, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్-5 జోన్ ఉత్తర్వులు చెల్లవని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు.