Rains : బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఆవర్తనం ఏర్పడింది. దీంతో ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్పై అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ ప్రకటించింది. ఈ అల్పపీడనం మంగళవారం నాటికి దక్షిణ దిశగా కదిలే సూచనలున్నాయని పేర్కొంది. మరోవైపు బంగాళాఖాతంలో ఈ నెల 18న మరో ఆవర్తనం ఏర్పడే అవకాశముందని తెలిపింది. పశ్చిమ దిశ నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.
తెలంగాణలో 4 రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ , జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
బుధవారం నుంచి గురువారం వరకు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.