Opposition Parties meeting in bangalore(Politics news today India) : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న వేళ జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సార్వత్రిక ఎన్నికలకు మరో 9 నెలల సమయమే ఉన్న నేపథ్యంలో విపక్షాలు బలసమీకరణకు సిద్ధమయ్యాయి. బీజేపీ కూటమిని ఎదుర్కొనేందుకు ఏకతాటిపైకి వస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో బెంగళూరులో విపక్షాల సమావేశం జరగనుంది. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కాలరాసే ఆర్డినెన్సును వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో విపక్ష భేటీకి హాజరు కావాలని ఆప్ నిర్ణయించింది. దాదాపు 26 పార్టీలు విపక్ష కూటమి వైపు ఉన్నాయి.
పట్నాలో విపక్షాల తొలి సమావేశం జరిగింది. ఇప్పుడు బెంగళూరులో రెండో సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తాజ్ వెస్ట్ఎండ్ హోటల్లో జరిగే ఈ సమావేశానికి ఏర్పాట్లను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా పర్యవేక్షించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఈ సమావేశంలో పాల్గొంటారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ , బిహార్ సీఎం నితీశ్ కుమార్ , తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ , ఎన్సీపీ అధినేత శరద్పవార్ , ఆర్జేడీ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ , మహారాష్ట్ర నేతలు ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ ఈ సమావేశానికి హాజరవుతారు. ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆర్ఎస్పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) పార్టీల నేతలు ఈ భేటీలో పాల్గొంటారు.
విపక్షాల సమావేశంలో బీజేపీ విధానాలపై చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు కాషాయ పార్టీ చేస్తున్న ప్రయత్నాలపై ఉమ్మడి ఆందోళన చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. విపక్షాలు ఐక్యతను ముందుకు తీసుకువెళ్లేందు కార్యాచరణను ప్రకటించనున్నారు.