Telangana : తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ‘చేతివృత్తులకు చేయూత’ పథకం ఆదిలోనే ఆపసోపాలు పడుతోంది. శనివారమే ఈ కొత్త పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి రావాల్సి ఉన్నా.. అది సాధ్యం కాలేదు. మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ లో మొక్కుబడిగా పథకాన్ని ప్రారంభించి.. కొద్దిమందికి మాత్రమే చెక్కులను అందించారు.
శనివారం ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడా ఈ స్కీమ్ ప్రారంభం కాలేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదన్న సాకుతో జిల్లా కలెక్టర్లు ఈ పథకాన్ని ప్రారంభించలేదు. ఫలితంగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు చెక్కులు అందజేయలేదు. అయితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేని కారణంగానే పథకాన్ని ప్రారంభించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీసీల ఓట్లను దండుకునేందుకు ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిందన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కానీ నిధులు లేకపోవడం పథకం అమలుకు ప్రధాన అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు పలు జిల్లాల్లో అందుబాటులో ఉన్నా కేవలం ఫండ్స్ సమస్య కారణంగానే దీన్ని ప్రారంభించలేదని సమాచారం.
బీసీల్లో నెలకొన్న వ్యతిరేకత చల్లార్చేందుకు.. చేతివృత్తులకు చేయూత పథకాన్ని తెరపైకి తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున సాయం అందించే పథకం కోసం దరఖాస్తులను కూడా స్వీకరించింది. అన్ని జిల్లాల నుంచి సుమారు 5 లక్షల 28వేల దరఖాస్తులు వచ్చినట్టు మంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే ప్రకటించారు. చివరకు ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారులకు మాత్రమే చెక్కులు అందించనున్నట్టు ప్రకటించింది.