Bonalu : భాగ్యనగరం బోనమెత్తింది. పాతబస్తీలోని లాల్ దర్వాజ అమ్మవారి ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. వీఐపీలు క్యూ కట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సింహవాహిని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆషాఢమాసం చివరి ఆదివారం లాల్దర్వాజ సింహవాహిని ఆలయంలో బోనాలు నిర్వహిస్తారు. 100 ఏళ్లకుపైగా చరిత్ర ఈ ఆలయం సొంతం. సోమవారం ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. ఆ తర్వాత రంగం నిర్వహిస్తారు. అనురాధ భవిష్యవాణి వినిపిస్తారు. ఆషాడ బోనాల సందడి రేపటితో పూర్తవనుంది.
బోనాల నేపథ్యంలో పాతబస్తీలో ఆదివారం, సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫలక్నుమా, చార్మినార్, మీర్చౌక్, బహదూర్పురా ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలోని ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. సోమవారం రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు.