BRS : తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ లో ముసలం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఎన్నికల సమీపిస్తున్న వేళ.. ఇప్పటి వరకూ సైలెంట్ గా ఉన్న అసమ్మతివాదులు ఒక్కొక్కరుగా రోడ్డెక్కుతున్నారు. తాజాగా హన్మకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గం, పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలపై ఉద్యమకారులు గళమెత్తారు.
పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై ఉద్యమకారులు పోరు బాట పట్టారు. ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉద్యమకారులకు టికెట్ ఇవ్వాలని ఆత్మకూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విష్ణు అధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. పరకాల టికెట్ ఉద్యమకారులకే కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే చల్లా.. ప్రశ్నించినందుకు తనపై సస్పెన్షన్ వేటు వేశారని చెబుతున్నారు. ఎమ్మెల్యే తీరుపై హనుమకొండ జిల్లా అధ్యక్షులు వినయ్ భాస్కర్ కు ఫిర్యాదు చేశారు. విష్ణుకు విద్యార్థి, ఉద్యమసంఘాల నాయకులు అండగా నిలుస్తున్నారు.
ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కూడా రోడ్డెక్కారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు వ్యతిరేకంగా పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు. గోదావరిఖని పట్టణంలోని 30వ వార్డులో నిర్వహించిన యాత్రలో.. టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
మరోమూడు నెలల్లో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. దాదాపు సగానికిపైగా నియోజకవర్గాల్లో అసమ్మతివాదులు బయటకు వస్తున్నారు. దీంతో వీరి ప్రభావం రానున్న ఎన్నికలపై బలంగా పడే అవకాశం ఉండడంతో పార్టీ అధిష్టానంలో కలవరం మొదలైంది.