CM KCR: గజ్వేల్. సీఎం కేసీఆర్కు సిట్టింగ్ స్థానం. వరుసగా రెండుసార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి మాత్రం ముచ్చట తీరేలే కనిపించడం లేదు. ప్రభుత్వంతో పాటు గులాబీ బాస్ మీద కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. తమ ఎమ్మెల్యే ఫామ్హౌజ్కైతే వస్తున్నారు కానీ, మిగతా నియోజకవర్గానికి ముఖమే చూపించట్లేదని మండిపడుతున్నారు. గజ్వేల్లో ఈసారి కేసీఆర్ గెలవడం చాలా కష్టమంటున్నారు. అటు ఈటల రాజేందర్, తీన్మార్ మల్లన్న, గద్దర్లు సైతం గజ్వేల్ మీద కన్నేశారు. పోటీకి సై అంటే సై అంటున్నారు. ఇలా.. గజ్వేల్లో గెలుపు ఫికర్ పట్టుకుందట కేసీఆర్కు.
వాట్ నెక్ట్స్? గజ్వేల్లో గెలిచే ఛాన్స్ లేదని సర్వేలో తేలడంతో.. ఇక ఎక్కడా పోటీ చేయకుండా గమ్మునుంటారా? ఉండరుగా. మరో స్థానం చూసుకుంటారుగా. అదే అన్వేషణలో ఉన్నారట గులాబీ బాస్. సేఫ్ సీటు కోసం సర్వేలు చేయిస్తున్నారట. ఆయనకు ఇలా లొకేషన్లు మారడం కొత్తేం కాదు. ఉద్యమ సమయంలో ఓసారి కరీంనగర్ ఎంపీగా, ఇంకోసారి మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేశారు. ఆ తర్వాత మెదక్ ఎంపీగానూ గెలిచి.. రాజీనామా చేశారు. ఇలా ఎక్కడ ఓడిపోతానని తెలిస్తే.. అక్కడి నుంచి పారిపోయి.. కొత్త ప్రాంతంలో.. ఫ్రెష్ కేండిడేట్గా బరిలో నిలిచే అలవాటు కేసీఆర్కు ఉందని గుర్తు చేస్తున్నారు. ఈసారి సైతం అదే జరగబోతోందని అంటున్నారు. ఇలా అంటున్నది ఎవరో మామూలు వ్యక్తి కాదు.. తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయే.. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.
అవును, రేవంత్రెడ్డే ఈ మాట చెప్పారు. ఓడిపోతారని సర్వేలు హెచ్చరించడంతో ఈసారి గజ్వేల్లో కేసీఆర్ పోటీ చేయరని చెబుతున్నారు. గజ్వేల్ కాకుండా కామారెడ్డి నుంచి బరిలో దిగేందుకు కసరత్తు చేస్తున్నారని రేవంత్ అన్నారు. ఇప్పటికే సర్వేలు చేయించుకున్నారని.. పాజిటివ్గా రావడంతో.. ఈసారి గులాబీ బాస్ గురి కామారెడ్డిపైనే అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్థన్ను ఇప్పటికే పిలిపించుకుని.. గంప కింద కమ్మేశారని చెప్పారు. తమ మైనార్టీ లీడర్ షబ్బీర్అలీ సీటుకే ఎసరు పెట్టాలని కేసీఆర్ చూస్తున్నారని రేవంత్రెడ్డి ఆరోపించారు.
దమ్ముంటే ఈసారి గజ్వేల్ నుంచే పోటీ చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించాలని.. సిట్టింగులు అందరికీ మళ్లీ టికెట్లు ఇస్తానని చెప్పాలని.. సవాల్ చేశారు రేవంత్రెడ్డి. కేసీఆర్ చేయించిన సర్వేల్లో 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతారని వచ్చిందని చెప్పారు.