Local news Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు మహిళా సీఐల వ్యవహారశైలి ఇటీవల వివాదాస్పదమైంది. ఒకరు దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలవగా.. మరొకరు ఏకంగా ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని దందాలతో అక్రమ సంపాదనకు దిగడం విస్మయాన్ని కలిగిస్తోంది. దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచిన శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్పై రాష్ట్ర మానవహక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేసు నమోదు చేశారు HRC జ్యూడిషియల్ సభ్యులు దండే సుబ్రహ్మణ్యం. సీఐ అంజు యాదవ్కు నోటీసులు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇటీవల జనసేన నాయకులపై శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ చేయిచేసుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సీఎం జగన్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన నాయకులపై.. సీఐ అంజు యాదవ్ దురుసుగా ప్రవర్తించారు. ఓ నాయకుడి రెండు చెంపలు వాయించారు. ఆ తర్వాత నాయకులను వెనక్కి గెంటేశారు. దీంతో ఈ అంశం వివాదస్పదంగా మారింది.
శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పై గతంలో జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. వెంటనే ఆమెపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖాశర్మ ఆదేశించారు. గతేడాది ఓ మహిళా వ్యాపారిపై దాడికి పాల్పడినందుకు గానూ అప్పట్లో కేసు నమోదైంది.
ఇక విశాఖపట్నంలో సీఐ స్వర్ణలత వ్యవహారం కూడా వివాదాస్పదమైంది. 2వేల రూపాయల నోట్ల మార్పిడి కేసులో ఆమె అరెస్టు కూడా అయ్యారు. గతంలోనూ స్వర్ణలతపై ఏఆర్ హోంగార్డు ఎస్సైగా పనిచేస్తున్నప్పుడే హోంగార్డు నియామకాల విషయంలో ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు విశ్రాంత నేవీ అధికారులను బెదిరించి 12 లక్షలు కాజేశారనే అభియోగంపై స్వర్ణలత, ఆమె డ్రైవర్గా పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ మెహర్, హోం గార్డు శ్రీనుతో పాటు బ్రోకర్గా వ్యవహరించిన సూరిని పోలీసులు అరెస్టు చేశారు.
ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న ఆమె.. విచారణకు ఏమాత్రం సహకరించడంలేదని తెలుస్తోంది. అధికారులు అడిగిన ప్రశ్నలకు సీఐ స్వర్ణలత.. సినిమా స్టోరీలు చెబుతూ కాలయాపన చేస్తున్నట్లు సమాచారం. దీంతో అధికారులు కూడా కాస్త కటువుగా వ్యవహరించాల్సి వస్తుందని ఆమెను హెచ్చరించినట్లుగా విశాఖ పోలీసు వర్గాల్లో ప్రచారం సాగుతోంది.