Narendra Modi france visit Updates(Morning news today telugu): ప్రధాని పారిస్ పర్యటన ముగిసింది. 2 రోజుల పర్యటనకు ప్రధాని మోదీ పారిస్ వెళ్లారు. అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ దంపతులు ప్రత్యేక ఆతిథ్యమిచ్చారు. ఫ్రాన్స్ బాస్టీల్ డే వేడుకలో అద్భుత ఆతిథ్యమిచ్చినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని మోదీ ఏ దేశ పర్యటనకు వెళ్లిన అక్కడి ప్రధానులకు ప్రత్యేక బహుమతులు ఇస్తూ ఉంటారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పొరుగు దేశాలకు తెలిసేలా స్వదేశీ కానుకలను స్వయంగా తయారు చేయించి ఇస్తారు. ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ.. బైడెన్ దంపతులకు గొప్ప బహుమతులు అందించారు.
ఈసారి పారిస్ వెళ్లిన ప్రధాని.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్కు చందనపు చెక్కతో చేసిన సితార వాయిద్యాన్ని అందజేశారు. అలాగే ఆయన సతీమణి బ్రిగెట్టికి..తెలంగాణకు చెందిన పోచంపల్లి సిల్క్ ఇక్కత్ చీరను అందజేశారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా మోదీకి కూడా ఫ్రాన్స్ ప్రధాని పలు బహుమతులను అందజేశారు.
పారిస్లో శుక్రవారం నాడు అట్టహాసంగా జరిగిన బాస్టీల్ డే పరేడ్ వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఫ్రాన్స్ అత్యున్నత పౌర, సైనిక పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్తో మెక్రాన్.. ప్రధాని మోదీని సత్కరించారు.
మోదీ 2 రోజుల పారిస్ పర్యటన ముగించుకుని UAE వెళ్లారు. ప్రత్యేక విమానంలో అబుదాబిలో దిగిన భారత ప్రధానికి అపూర్వ స్వాగతం లభించింది. యూఏఈ ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జాయేద్ మోదీని రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరు ఆపాయ్యంగా ఒకరినొకరు పలకరించుకుని..ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇరు దేశాల అధినేతలు భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఎనర్జీ, టెక్నాలజీ, హెల్త్ , ఎడ్యూకేషన్లో పరిస్పరం సహకరించుకుంటూ.. పురోగతి సాధించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.