Today breaking news in Telangana(Telugu news updates): చూద్దాం సై.. వేద్దాం సై.. అంటున్నాయి రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు. ఎన్నికల ముంగిట సత్తా చాటుకునేందుకు తగ్గేదేలే అంటున్నాయి. ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందంటూ.. సవాళ్లు-ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి . జులై 20న పంచ్ పవర్ చూపిస్తామని కాంగ్రెస్ చెబుతుంటే.. 24న కారు టాప్ గేర్ లో దూసుకుపోవడం ఖాయమంటున్నారు బీఆర్ఎస్ నేతలు.
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మహా అయితే మరో మూడు నెలలు టైం ఉంది. ఈ లోగా రాజకీయ పార్టీలు ఎవరి స్కెచ్ లు వారు వేస్తూ.. ప్రత్యర్థులను కట్టడి చేయాలని చూస్తున్నాయి. నియోజకవర్గాల్లో పార్టీ గెలుపునకు అవసరమైన నేతలను తమ పార్టీల్లోకి లాక్కునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని టార్గెట్ చేసింది హస్తం పార్టీ. వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడం ద్వారా అధికార కారు స్పీడ్కు బ్రేకులు వేయాలని చూస్తోంది. అటు హస్తం పార్టీ దూకుడును అడ్డుకునేందుకు గులాబీ పార్టీ కూడా కౌంటర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది.
పోటాపోటీగా బహిరంగసభలు ప్లాన్ చేస్తూ ఎవరి వ్యూహాలను వారు పక్కాగా అమలు చేస్తున్నారు. అధికార పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఈ నెల 20న భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ రానున్నారు. ఆమె సమక్షంలో పలువురు బీఆర్ఎస్కు చెందిన కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేష్ తో పాటు ప్రస్తుత జెడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న సరిత కూడా హస్తం గూటిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరితో పాటు పెద్ద సంఖ్యలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సెకండ్ గ్రేడ్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరుతారు. వనపర్తి జిల్లాకు చెందిన ఎంపీపీ మేఘారెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కొల్లాపూర్ సభలో ఆమె కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. సీనియర్లతో కలిసి పనిచేసి కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తామంటోంది మేఘారెడ్డి.
కాంగ్రెస్లో చేరికలు చూసి.. గులాబీబాస్ కు భయం పట్టుకుంది. వలసల స్పీడ్ను ఆపలేకపోతే.. అడ్రస్ గల్లంతు అవుతుందనే గుబులు వేధిస్తోంది. అందుకే కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చేందుకు గులాబీ బాస్ మరో స్కెచ్ వేశారు. కాంగ్రెస్ సభ జరిగిన నాలుగు రోజులకు.. అంటే జులై 24న.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కీలక నేతలు కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్నారట. ఇతర పార్టీల నాయకులతో పాటు కాంగ్రెస్ కు చెందిన కొందరు ముఖ్యనేతలు.. గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. అధికారికంగా పేర్లు మాత్రం బయటకు రాకపోయినా.. వారంతా ఇతర పార్టీల్లో ముఖ్య నేతలుగా ఉన్నారని సమాచారం అందుతోంది.
దీంతో తెలంగాణ రాజకీయాల్లో జులై 20న, 24న ఏం జరగబోతోంది అనే ఆసక్తి నెలకొంది. 20వ తేదీన తమ సత్తా చూపిస్తామని కాంగ్రెస్ చెబితే.. అసలు సినిమా 24న చూపిస్తామని బీఆర్ఎస్ ధీమాగా ఉంది. ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉండగానే రాజకీయం ఇంతలా హీటెక్కితే.. మున్ముందు ఆ వేడి ఇంకెలా ఉండనుందో?