Cheetah: మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో చిరుతపులుల మృత్యువాత కొనసాగుతోంది. నాలుగు నెలల కాలంలో ఏకంగా ఎనిమిది చిరుత పులులు మృతి చెందడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తాజాగా సూరజ్ అనే మరో చిరుత మృతి చెందింది. రెండు రోజుల క్రితం తేజస్ అనే మగ చీతా మృతి చెందింది. సూరజ్ చిరుత ఎలా చనిపోయిందో ఇంతవరకు తెలియలేదు. ఆ చిరుత మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు తెలియజేస్తామని చెప్పారు. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన వాటిలో ఒకటైన తేజస్ అనే మగ చిరుత మంగళవారం మృతి చెందింది. అయితే ఈ చిరుత మెడపై గాయాలున్నాయి.
ప్రాజెక్ట్ చితాలో భాగంగా కేంద్రం రెండో దఫాల్లో దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి 20 చిరుతలను భారత్కు తీసుకొచ్చింది. అయితే ఇందులో ఆరు చిరుతపులులు ఇప్పటికే మృతి చెందాయి. మరో రెండు చిరుత పులుల పిల్లలు పుట్టగానే మరణించాయి. మార్చ్ 27న సాష, ఏప్రిల్ 23న ఉదయ్, మే 9న దక్ష, మే 25న అప్పుడే పుట్టిన రెండు చిరుత పులులు మృతి చెందాయి. ఇందులో కొన్ని అనారోగ్య కారణాలతో మృతి చెందగా.. మరికొన్ని పరస్పరం దాడులు చేసుకొని మృతి చెందాయి. ఇక రెండు చిరుత పిల్లలు మాత్రం వాతావరణం సహకరించకపోవడంతో మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.
అయితే చిరుతపులుల మృతిపై దక్షిణాఫ్రికా వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ విన్సెంట్ ముందుగానే ఊహించారు. రానున్న రోజుల్లో మరికొన్ని చిరుతలు మృతి చెందుతాయని ఆయన ముందుగానే హెచ్చరించారు. నేషనల్ పార్క్లో చిరుత పులులు తమ సరిహద్దులను నిర్ణయించుకునే విషయంలో, పరస్పరం ఎదురుపడినప్పుడు జరిగే దాడుల్లో మృతి చెందుతాయని ఆయన తెలిపారు.
అయితే చిరుతపులులను సంరక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని నేషనల్ పార్క్ అధికారులు చెబుతున్నారు. దేశంలో చిరుతపులుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించింది. గతేడాది సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా మొదటి బ్యాచ్ చీతాలను కూనో నేషనల్ పార్క్లోకి వదిలారు. అయితే వరుసగా చిరుతల మృతితో కేంద్రం ఆశయానికి గండిపడుతుంది. వరుసగా చిరుత పులులు మృతి చెందడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.