YSRCP latest news today(AP political news): గడప గడపకు కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు స్థానికుల నుండి నిరసన సెగ తగులుతుంది. గోస్పాడు మండలం చింతకుంట్లలో ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే శిల్పా రవికి చుక్కెదురైంది. గ్రామంలో ఇప్పటి వరకు సరైన రోడ్లు లేవని..ప్రయాణించాలంటే ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు నిలదీశారు. ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పామని.. అయినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏ సమాధానం చెప్పాలో అర్థంకాని స్థితిలో ఎమ్మెల్యే శిల్పా రవి ఉండిపోయారు.
మరోవైపు అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. గడప గడపకు కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను ఓ మహిళ నిలదీసింది. తన కొడుకుకి ఉద్యోగం ఇప్పిస్తానని.. మీ పేరు చెప్పి డబ్బులు తీసుకున్నారని..ఇప్పటివరకు ఉద్యోగమయితే రాలేదని మండిపడింది. ఉద్యోగం ఇవ్వలేనప్పుడు డబ్బులు ఎందుకు తీసుకున్నారని ఎమ్మెల్యేను నిలదీసింది. దీంతో ఆయన.. ఆ మహిళ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు నాకు చెప్పి ఇచ్చారా? అని ఎదురు ప్రశ్నించారు. నీ కొడుకు..నోరు అదుపులో పెట్టుకోవాలని తీవ్ర పదజాలంతో దూషించారు.