PM Modi france visit(Telugu flash news): ఫ్రాన్స్లో భారత ప్రధాని మోదీకి అరుదైన గౌరవం లభించింది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మెక్రాన్.. మోదీకి ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్’ పురస్కారం ప్రధానం చేశారు. ఫ్రాన్స్ అత్యున్నత పౌర, సైనిక పురస్కారాన్ని అందుకున్న తొలి భారత ప్రధానిగా మోదీ గౌరవం దక్కించుకున్నారు.
ఎలీసీ ప్యాలెస్లో జరిగిన కార్యక్రమంలో మోదీకి ఈ అవార్డు అందించారు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్, జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బుట్రోస్ బుట్రోస్ ఘలి లాంటి ప్రపంచ ప్రముఖులు ఈ అవార్డును స్వీకరించారు. అలాగే ఈ కార్యక్రమానికి ముందు అధ్యక్ష భవనం ఎలీసీ ప్యాలెస్లో అధ్యక్షుడు మెక్రాన్ దంపతులు మోదీకి ప్రత్యేక విందు ఇచ్చారు.
ప్రధాని మోదీ రెండురోజులపాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ను ఫ్రాన్స్లోనూ వినియోగించేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని మోదీ తెలిపారు. భారతీయ విద్యార్థులు మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు ఐదేళ్ల వీసాలు మంజూరు చేయడానికి ఫ్రాన్స్ అంగీకారం తెలిపిందని ప్రకటించారు. మార్సెల్లీలో నూతన భారత కాన్సులేట్ను ప్రధాని ప్రారంభించారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం- బాస్టీల్ డే వేడుకల్లో గౌరవ అతిథిగా మోదీ పాల్గొంటారు.
గురువారం రాత్రి ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఫ్రాన్స్ స్టార్ ఫుట్బాల్ ఆటగాడు కిలియన్ ఎంబాపెపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్లో ఎంబాపె పాపులారిటీ పెరుగుతోందని చెప్పారు.