Delhi flood news live(Telugu news headlines today): దేశ రాజధాని వాసుల కష్టాలింకా తొలగిపోలేదు. మహోగ్రరూపాన్ని దాల్చిన యమునా నది ప్రవాహం తగ్గకపోవడంతో.. ఢిల్లీ వరద కష్టాలింకా తొలగిపోలేదు. ఎక్కడ చూసినా వరదనీటిలో జనాల కష్టాలుపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
హస్తిన వాసులు నడుం లోతు నీటిలో నడుస్తున్న దర్శనమిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచే ఉంది. దీంతో ఉదయం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలా అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు వర్షం నీటిలోనే నానుతున్నాయి.
మరోవైపు రాజ్ ఘాట్ దగ్గర భారీగా వరద నీరు నిలిచిపోయింది. రాజ్ ఘాట్ గేటు కూడా మునిపోయే వరకు నీరొచ్చింది. దీంతో ఆ పరిసరాల్లోకి ఎవరూ వెళ్లడానికి సాహసం చేయడం లేదు. నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి పరిసరాల్లోకి వరదనీరు చుట్టుముట్టగా.. ఇప్పటికీ పరిస్థితిలో మార్పులేదు.
ఇటు యమునా నది ఉద్ధృతి మాత్రం తగ్గలేదు. నదీ మట్టం ఇంకా 208.42 మీటర్లు ఉండటంతో.. ఢిల్లీకి ఇంకా ముప్పు తొలగిపోలేదని నీటి శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురవడం లేదని.. అయినా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మరోసారి భారీ వర్షం కురిసినా.. పరిస్థితి దారుణంగా ఉంటుందని.. హెచ్చరికలు చేస్తున్నారు.